‘రేయ్.. గేట్లు విరగ్గొట్టు... అద్దాలు పగలగొట్టు’, టోల్గేట్ సిబ్బందిపై బీజేపీ నేత, అనుచరుల వీరంగం
నెల్లూరు: ఓ టోల్గేటు వద్ద బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి నన్నపరెడ్డి సురేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. అడ్డు వచ్చిన టోల్గేట్ సిబ్బందిపై దాడి చేశారు.
ఈ మేరకు ఫిర్యాదు రావడంతో వెంకటాచలం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన తరువాతే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్రెడ్డి ఆయన అనుచరులు శనివారం ఉదయం ఐదు కార్లలో బయలుదేరారు.
వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ టోల్ప్లాజా ఫ్రీ గేట్లు వద్ద కార్లు ఆగాయి. గేట్లు ఎత్తాలని బీజేపీ నేత అక్కడి సిబ్బందిని కోరారు. ఫ్రీ పాస్ ఉంటే తప్ప గేట్లు ఎత్తలేమని సెక్యూరిటీ సిబ్బంది బదులిచ్చారు.
దీంతో సురేష్ రెడ్డి ఆగ్రహించారు. 'రేయ్.. సురేష్ రెడ్డి వస్తే గేటు తీయరా? ఏందిరా వాడిని అడిగేది.. గేట్లు విరగ్గొట్టండి.. కౌంటర్ అద్దాలు పగలగొట్టండి..' అంటూ తన అనుచరులకు ఆదేశాలిచ్చారు.
దీంతో సురేష్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. గేట్లు, కౌంటర్ అద్దాలను ధ్వంసం చేశారు. సాయంత్రం తిరిగి అదే దారిలో వచ్చేటప్పుడు టోల్ ప్లాజా నిర్వాహకులు వారిని ఆపి 'జరిగిందేదో జరిగిపోయింది.. కాంప్రమైజ్ చేసుకుందాం.. నష్టపరిహారం ఇవ్వండి..' అంటూ ప్రాధేయపడ్డారు.
ఇందుకు సురేష్ రెడ్డి ససేమిరా అన్నారు. 'నువ్వేం చేసుకుంటావో చేసుకో.. నష్టపరిహారం ఇచ్చే సమస్యే లేదు..' అంటూ టోల్ప్లాజా సెక్యూరిటీ మేనేజర్ పట్రా శివరాంతో మరోసారి దురుసుగా ప్రవర్తించారు.
దీంతో శివరాం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి నన్నపరెడ్డి సురేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేశారని, సెక్యూరిటీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, గార్డు గురవయ్య, గన్మెన్ మురళీశర్మలపై దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు.
ప్రజా ప్రతినిధులకు ముందుగానే టోల్ప్లాజా వాహన పాస్ జారీ చేస్తే ఆ నెంబర్లు ఉన్న వాహనాలు ఫ్రీ గేటు ద్వారా వెళ్లేందుకు అనుమతిస్తామని, మిగిలిన వాహనాలన్నీ టోల్ రుసుము చెల్లించాల్సిందనని, ఈ నిబంధన తెలిసి కూడా సురేష్రెడ్డి తమపై దాడి చేయడం ఏమిటని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్లను కూడా అప్పగించడంతో వెంకటాచలం పోలీసులు క్రైమ్ నెంబరు 321/17తో సురేష్రెడ్డి మరో ఏడుగురిపై 427, 352, 506, 290 ఐపీసీ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.