జగన్ స్ధానంలో వెల్లంపల్లి- నమ్మకం లేకపోతే అలా చేసుకోవచ్చు- ఐవైఆర్ సలహా
తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. శ్రీవారిపై నమ్మకం లేని అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా దర్శనానికి వస్తారని బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ఉందని నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ చిన్నారి నేరస్తుడా? - స్త్రీ,పురుషులు ఒకే గదిలోనా? - శారదా పీఠానికి టీటీడీ నిధులా?: చంద్రబాబు ఫైర్
డిక్లరేషన్ విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రికి శ్రీవారిపై నమ్మకం లేకపోతే పట్టువస్త్రాల సమర్పణకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను పంపాలని బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు సలహా ఇచ్చారు. డిక్లరేషన్ నిబంధన ఈ నాటిది కాదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీలో కొనసాగుతున్న నిబంధనను కాదని డిక్లరేషన్ను మినహాయించడమేంటని ఆయన ప్రశ్నించారు. తాను విద్యార్ధి దశలో ఉన్నప్పుడే దర్శనానికి వెళితే తనతో పాటు వచ్చిన విదేశీ భక్తుడిని డిక్లరేషన్ తీసుకున్నాకే అనుమతించారని ఐవైఆర్ గుర్తుచేసుకున్నారు.
Recommended Video
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శనానికి వచ్చినపుడు కూడా అప్పటి ఈవో డిక్లరేషన్కు పట్టుబట్టి కొందరి ఆగ్రహానికి గురయ్యారని ఐవైఆర్ గుర్తుచేశారు. ఇవాళ ఉన్నపళంగా డిక్లరేషన్ రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో టీటీడీ ఛైర్మన్ సెలవిస్తే బావుంటుందని ఐవైఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే పట్టు వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదని, నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించవచ్చని మాజీ సీఎస్ కూడా అయిన ఐవైఆర్ సలహా ఇచ్చారు.