వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన పురంధేశ్వరి: బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ నుంచి నో రెస్పాన్స్
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు తెర మీదికి రానున్నాయి.
రిపబ్లిక్ డే పరేడ్లో మెరిసిన రాఫెల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలెట్: ఆమె ఎవరో తెలుసా?
కొన్నింటికి కొత్త పేర్లు..
కొత్తగా ఆవిర్భవించబోతోన్న 13 జిల్లాల్లో కొన్నింటికి.. వాటికి ఉన్న ప్రాధాన్యత ఆధారంగా పేర్లు పెట్టడాన్ని కూడా పూర్తి చేసింది జగన్ సర్కార్. రాయచోటి కేంద్రంగా ఆవిర్భవించనున్న జిల్లాకు తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య పేరును పెట్టింది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాకు శ్రీ సత్యసాయిగా నామకరణం చేసింది. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తూ దానికి శ్రీవారి పేరును పెట్టింది. శ్రీబాలాజీ జిల్లాగా పిలవనుంది.
కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు..
పార్వతిపురం కేంద్రంగా మన్యం జిల్లాను తెరమీదికి తీసుకుని రానుంది. పాడేరు జిల్లాకు విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టింది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాకు కోనసీమ పేరును పెట్టింది ప్రభుత్వం. నరసరావుపేట జిల్లాకు పల్నాడు పేరును పెట్టింది. కొత్తగా మనుగడలోకి రానున్న విజయవాడ జిల్లాకు- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును పెట్టింది.
స్వాగతించిన పురంధేశ్వరి
విజయవాడ జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టడం పట్ల ఆయన కుమార్తె, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బిడ్డగా తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. ఆ మహనీయుడు జన్మించిన జిల్లాకు ఆయన పేరే పెట్టడ మంచి నిర్ణయమని చెప్పారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని, ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరిందని వ్యాఖ్యానించా
బాలకృష్ణ.. జూనియర్ నుంచి నో రెస్పాన్స్
విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించడం ఇదే తొలిసారి. నందమూరి కుటుంబానికి చెందిన వారు గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ దీనిపై ఇప్పటిదాకా తమ స్పందనను వ్యక్తం చేయలేదు. ఎన్టీఆర్ కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గానీ, ఆయన మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Recommended Video
టీడీపీ మౌనానికి కారణం..
ఎన్టీ రామారావు విగ్రహానికి దండ వేసి, దండం పెట్టనిదే తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయంగా ఏ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించరు. అలాంటిది ఆయన పేరును ఓ జిల్లాకు పెట్టినా స్పందించకపోవడం.. టీడీపీ అనుసరిస్తోన్న వ్యూహాత్మక మౌనానికి నిదర్శనమని అంటున్నారు. పద్మ అవార్డులను అందుకున్న వారికి అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మొదలుకుని పలువురు నాయకులు, మాజీ మంత్రులు పోస్టులు పెట్టినా- కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పట్ల మాత్రం స్పందించడానికి నిరాకరిస్తున్నారు.