బిజెపి పొత్తు లేకుండా చంద్రబాబు ఎప్పుడు గెలవలేదు:సురేష్ రెడ్డి
నెల్లూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై బిజెపి నేత సురేష్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఒంటరిగా ఏనాడూ విజయం సాధించలేదని చెప్పారు. ప్రతిసారీ బిజెపితొ పొత్తు కారణంగానే విజయం సాధించారని ఆయన గుర్తుచ ేశారు.
అవసరానికి తగట్టుగా మాట్లాడడం చంద్రబాబుకే చెల్లించదని బిజెపి నేత సురేష్ రెడ్డి ఇటీవల కాలంలోనే విమర్శలు గుప్పించారు. గతంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదని అన్నారు. గతంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వల్లే చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యారని అభిప్రాయపడ్డారు.
ఏపీ మంత్రి నారాయణ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాల్లోనూ అవినీతి జరుగుతుందని సురేష్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలు కొందరు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చుతున్నారని బీజేపీ నేత సురేష్ రెడ్డి వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెబుతున్నవన్నీ వాస్తవాలనేనని బీజేపీ నేత సురేష్ రెడ్డి చెప్పారు.