బాలకృష్ణ టూ వివేకా మిస్టరీ- వైఎస్, నారా లింక్- గురుమూర్తి మతమేదీ-బీజేపీ విష్ణు షాకింగ్
తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో ప్రదాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో అధికార వైసీపీని విపక్ష టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత విష్ణు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్, నారా కుటుంబాలు పరస్పర ఆధారితంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు.. బాలకృష్ణ కాల్పుల కేసు నుంచి వివేకానందరెడ్డి హత్య కేసు వరకూ పరిణామాల్ని ఇందుకు ఉదాహరణగా చెప్పారు. దీంతో విష్ణు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నడ్డా వ్యాఖ్యలపై స్పందించరూ...
నిన్న తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు విమర్శలు చేశారు. అయితే వీటిపై వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా స్పందించలేదు. దీంతో చూసి చూసి బీజేపీ నేత విష్ణు దీనిపై వైసీపీ నేతల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. నడ్డా వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు. అంటే వైసీపీ సర్కారుపై నడ్డా వ్యాఖ్యలు నిజమేనని ఒప్పుకున్నట్లేనా అని ఆయన నిలదీశారు. మద్యం తయారీలో కొత్త కంపెనీలు ఎందుకొచ్చాయని, పాత కంపెనీలు ఏమయ్యాయని విష్ణు ప్రశ్నించారు. లిక్కర్ స్కాంపై నడ్డా వ్యాఖ్యల్ని తాము నిరూపిస్తామన్నారు. అంబటి రాంబాబు చర్చకు వస్తారా అని అడిగారు.
గురుమూర్తి మతం చెప్పడానికి భయమేల ?
తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా రంగంలో ఉన్న డాక్టర్ గురుమూర్తి మతం ఏంటో చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ నేత విష్ణు సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ అభ్యర్ధికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయని, దీనిపై వైసీపీ ఎందుకు స్పందించడం లేదని విష్ణు ప్రశ్నించారు. చనిపోయిన బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో ఒకరికి వైసీపీ ఎందుకు తిరుపతి సీటు ఇవ్వలేదని విష్ణు వైసీపీని టార్గెట్ చేశారు. దళితుల్ని మోసం చేస్తోంది వైసీపీనా కాదా అని ప్రశ్నించారు.
బాలకృష్ణ కాల్పుల నుంచి వివేకా హత్య వరకూ మిస్టరీలే
గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న బాలకృష్ణ కాల్పుల కేసు నుంచి చంద్రబాబు హయాంలో జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసు వరకూ అంతా మిస్టరీగా ఉండిపోవడానికి కారణాలేంటని బీజేపీ నేత విష్ణు ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన కోడి కత్తి ఘటనపైనా మిస్టరీయే కొనసాగుతోందని విష్ణు ఆక్షేపించారు. రామతీర్ధంలో రాముడి శిరస్సు ఛేదించిన ఘటన కూడా మిస్టరీగానే మిగిలిపోయేలా ఉందని విష్ణు విమర్శించారు.
వైఎస్, నారా కుటుంబాల లింక్ ఇదే
వైఎస్, నారా కుటుంబాలకు ఎంత సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలుసని బీజేపీ నేత విష్ణు గుర్తుచేశారు. అందుకే అప్పటి బాలకృష్ణ కేసు నుంచి ఇప్పటి వివేకా హత్య కేసు వరకూ మిస్టరీగా మిగిలిపోయాయని ఆయన ఆరోపించారు. ఇరు కుటుంబాలకు పరస్పరం ఆధారపడుతున్నందునే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్, నారా కుటుంబాల పాలనలో జరిగిన పలు ఘటనలపై దర్యాప్తు చేసి ఎందుకు వాస్తవాలు తేల్చలేదని ఆయన ప్రశ్నించారు.
పవన్ అంటే వైసీపీ నేతలకు భయం
కరోనా వల్ల సీఎం టూర్ రద్దు చేసుకున్నట్లు చెప్పారు కానీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలు, బహిరంగసభలు జరపడం లేదా అని విష్ణు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పేరు వింటే వైసీపీ నేతల్లో వణుకు పుడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆర్దికంగా దెబ్బ తీయాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని విష్ణు ఆరోపించారు. బీజేపీకి ఓట్లు లేకపోతే ఎందుకు టీడీపీ, వైసీపీ భయపడుతున్నాయని విష్ణు ఆయా పార్టీల్ని సూటిగా ప్రశ్నించారు.