ప్రత్యేక హోదా, ఏపీ-తెలంగాణ విభేదాలపై అమిత్ షా, వెంకయ్య ఇలా
న్యూఢిల్లీ: కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం గత యూపీఏ ప్రభుత్వం హడావుడిగా రాష్ట్ర విభజన చేసిందని, విభజన ప్రక్రియలో రెండు ప్రాంతాల ప్రతినిధులను భాగస్వాములను చేయలేదని, దాని పరిణామాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని, ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్య మార్గంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు.
ఆయన ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ప్రత్యేక హోదా, తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం గురించి స్పందించారు. ఇంకా పలు అంశాలపై స్పందించారు.
ఎన్టీయేలో చేరేందుకు తెరాస నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. త్వరలోనే దాని ఫలితాలు కనిపిస్తాయన్నారు.
పోలవరం ప్రాజెక్టు పైన ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడారని, త్వరలో దీనిపై ఫలితాలు కనిపిస్తాయని చెప్పారు. జైట్లీ చెప్పిన రెవెన్యూ లోటు రాష్ట్రం నిర్వచనాన్ని ఏపీ ప్రత్యేక హోదాతో ముడిపెట్టవద్దని, ఏపీకి ప్రత్యేక హోదాపై సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని చెప్పారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం మోడీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. పెద్ద రాష్ట్రాన్ని విభజించినప్పుడు కొన్ని వివాదాలు సహజమని, అయితే, ఈ రెండు రాష్ట్రాల మధ్య మరింత తీవ్రంగా ఉన్నాయన్నారు.
వీటి పరిష్కారానికి చర్యలేమేలని మోడీ ప్రభుత్వం నమ్ముతోందన్నారు. మరిన్ని సంప్రదింపుల వల్ల విభేదాలు పరిష్కారమవుతాయన్నారు. ఏపీ, తెలంగాణల్లో బీజేపీని విస్తరిస్తున్నామన్నారు. ఓ పార్టీ ఎదుగుదలకు, మిత్ర పక్షాలకు సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. అది పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. తెలంగాణకు కేంద్రమంత్రి హన్స్ రాజ్ అహిర్ అదనపు ఇంచార్జిగా ఉన్నారని, ఏపీ బాధ్యతలు కేంద్రమంత్రి జేపీ నడ్డా చూస్తున్నారన్నారు.
మరోవైపు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా పైన వేరుగా స్పందించారు. ప్రత్యేక హోదా అర్హతలు ఏపీకి లేవని, ఆ పాపం యూపీఏదేనని ధ్వజమెత్తారు. ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయన్నారు. టీడీపీతో తమ బంధం కొనసాగుతుందని, జగన్తో దోస్తీ అవగాహన లేని వాళ్ల మాట అన్నారు. కేంద్రమంత్రిగా తనకు అన్ని రాష్ట్రాలు ఒకటే అన్నారు.