రాయలసీమపై బాబు సవతి తల్లి ప్రేమ: సోము వీర్రాజు
కడప: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమపై బిజెపి కన్నబిడ్డపై చూపే ప్రేమను చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
శనివారం నాడు కడపలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తానని చెబుతోందో, అదే రకంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడ పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై బిజెపి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. కడప విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కారణాలు ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ప్రజలకు ఏం పనులు చేయకపోయినా చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాత్రం తమ స్వంత ప్రచారం చేసుకొంటుందని సోము వీర్రాజు టిడిపిపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు సర్కార్ ఏ పనిని పూర్తి చేసిందో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ కనుసన్నల్లోనే పాలన సాగుతోందని వీర్రాజు విమర్శలు చేశారు. లోకేష్, చంద్రబాబునాయుడు తప్ప రాష్ట్రంలో ఏ మంత్రికి పనులు చేసే అధికారం లేదన్నారు. రాష్ట్ర అప్కో చైర్మెన్ గుజ్జల శ్రీనివాసులు అన్ని పనుల్లో కమీషన్లు తీసుకొని అవినీతికి పాల్పడుతున్నారని వీర్రాజు ఆరోపించారు.
యూనిఫామ్లు కుట్టించడానికే రూ. 16 కోట్లు కమిషన్ తీసుకొన్నారని ఆయన ఆరోపించారు. గతంలో ప్యాకేజీ కావాలని, ఇప్పుడేమో ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. రాయలసీమ జిల్లాలకు కేంద్రం రూ.1050 కోట్లు నిధులను విడుదల చేసిందన్నారు. అయితే ఆయా జిల్లాల్లో అభివృద్ది మాత్రం శూన్యమన్నారు.
టిడిపి మద్దతు కొనసాగినంత కాలం తాము చిత్రహింసలు అనుభవించామని చెప్పారు. ఇంకా కొనసాగి ఉంటే ఆత్మహత్యలే శరణ్యమని చెప్పారు. ఆప్కో కమిటీని రద్దు చేసి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.