పవన్ కు బీజేపీ సపోర్ట్- వైసీపీ విమర్శలపై జీవీఎల్ ట్వీట్-సహనం, బాధ్యత ఉండాలంటూ...
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నిరోజులుగా మాటలయుద్ధం సాగిస్తున్నారు. హైదరాబాద్ లో రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తో మొదలుపెట్టిన ఈ మాటల యుద్దం కాస్తా ఆ తర్వాత ట్వీట్ వార్ గా మారింది. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ వైసీపీ మంత్రుల తీరుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మిత్రపక్షం బీజేపీ నుంచి మద్దతు లభించడం లేదనే చర్చ మొదలైంది. దీంతో ఇవాళ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు.
ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెట్లను అందుబాటులోకి తీసుకురావాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలంటే తనను టార్గెట్ చేసుకుని, టాలీవుడ్ ను వదిలేయాలని ఆయన రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో విమర్శించారు. అంతటితో ఆగకుండా వైసీపీ మంత్రి పేర్నినానిని సన్నాసి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ మంత్రులు ఆయనపై వరుసగా విరుచుకుపడ్డారు. దీనిపై ఇవాళ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు.
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులపై జీవీఎల్ ఓ ట్వీట్ లో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రుల దుర్భాషలను ఖండిస్తున్నట్లు జీవీఎల్ తెలిపారు. విమర్స తట్టుకునే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలని జీవీఎల్ వైసీపీ మంత్రులకు సూచించారు. నువ్వు ఒకటంటే నేను వందంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచికమన్నారు. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై దృష్టిపెట్టాలని వైసీపీ సర్కార్ కు బీజేపీ ఎంపీ జీవీఎల్ సూచించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన పోసాని కృష్ణమురళి వంటి వారు కూడా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నిన్న చేసిన ట్వీట్లో గ్రామ సింహాలంటూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. దీంతో పవన్, వైసీపీ వార్ మరికొన్నిరోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.