భయంతోనే ఎపి ప్రభుత్వం ఆ ప్రయత్నం:జీవీఎల్;ఆ విషయంలో చంద్రబాబుసక్సెస్:మంత్రి సోమిరెడ్డి
విజయవాడ:ఎపి ప్రభుత్వంపై బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. టిడిపి నేతల అవినీతిని కేంద్ర ప్రభుత్వం బైటపెడుతుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సినిమా చూపిస్తున్నారని ఎంపి జివిఎల్ ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతం రైతుల నుంచి ఎకరం రూ.10 లక్షలకే కొనుగోలు చేసి రైతులను దారుణంగా మోసం చేశారని జివిఎల్ ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏర్పాటుని టిడిపి నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తమ స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు.
అమరావతిలో...అంతా వ్యాపారమే
అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల ముసుగులో వెయ్యి కోట్లు స్వాహా చేశారని...అసలు టిడిపి అమరావతిని తన వ్యాపారాలకోసం వాడుకుంటోందని జివిఎల్ మండిపడ్డారు. అమరావతిలో సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన 1690 ఎకరాల భూమిలో 1070 ఎకరాలను ఫ్లాట్లుగా అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినివ్వడంపై ఎంపి జివిఎల్ మండిపడ్డారు. ఆ కంపెనీ 306 కోట్ల పెట్టుబడులు పెట్టినదానికి 16 వేల కోట్ల విలువైన భూమిని అప్పగిస్తారా?...ఇదెక్కడి దారుణం అంటూ టిడిపి ప్రభుత్వాన్ని నిలదీశారు.
జివిఎల్ చెప్పిన...కొత్త అర్థం
టీడీపీ అంటే తెగ దోచేసే ప్రభుత్వం అని...ఆ రకంగానే రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం హయాంలో గడచిన నాలుగేళ్లలో రూ. 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని జీవీఎల్ ఆరోపించారు. ఆ డబ్బంతా టిడిపి నేతలే వివిధ రకాలుగా స్వాహా చేశారని, ప్రజాధనాన్ని ఇలా సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం దుర్మార్గమని ఎంపి జివిఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ ఇలా...యనమల అలా
ప్రధానికి ఈ అక్రమాలపై సమాచారం ఉందని, ఈ ల్యాండ్ మాఫియాకు తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుంటే...ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు పంటి వైద్యం కోసం సింగపూర్కు వెళ్లి లక్షలు ఖర్చు చేశారని...ఇదీ టిడిపి నేతల తీరు అని ఎంపి జివిఎల్ మండిపడ్డారు.
చంద్రబాబు...సక్సెస్
మరోవైపు నెల్లూరులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యారని కొనియాడారు. పరిస్థితి ఇప్పుడు ప్రధానికి ఆర్బీఐ గవర్నర్ వ్యతిరేకంగా మాట్లాడేంత వరకూ వచ్చిందన్నారు. సీబీఐ విశ్వసనీయత కోల్పోయిందని మంత్రి సోమిరెడ్డి పునరుద్ఘాటించారు. దేశం మొత్తం మీద సీబీఐకి కన్సెంట్ ఇచ్చింది 9 రాష్ట్రాలు మాత్రమేనని, గుజరాత్ ప్రభుత్వం కూడా సీబీఐకి కన్సెంట్ ఇవ్వలేదని మంత్రి సోమిరెడ్డి వివరించారు.