లోకేష్తో చర్చకు సిద్ధం:బిజెపి ఎంపి జీవీఎల్...ఆయన స్థాయికి నేను చాలు:బుద్ధా వెంకన్న
విజయవాడ:భూ కేటాయింపుల్లో అక్రమాలంటూ బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు చేస్తున్న ఆరోపణలపై టిడిపి ఎంపి సిఎం రమేష్ స్పందించి...ఈ విషయమై మంత్రి లోకేష్ తో చర్చకు సిద్ధమా?...అని ట్విట్టర్ లో జివిఎల్ కు సవాల్ విసిరారు.
ఈ ఛాలెంజ్ పై ప్రతిస్పందించిన జివిఎల్ సమయం ఎప్పుడో చెప్పాలని...తాను లోకేష్ తో చర్చకు సిద్దమేనని ప్రకటించారు. హాయ్ల్యాండ్ను యువరాజు కారుచౌకగా కొట్టేయడానికి కుట్ర జరుగుతుందని జీవీఎల్ ఆరోపించారు. అయితే యువరాజైనా, మంత్రులైనా, అధికారులైనా...ఎవరైనా ఈ కుట్రలో పాత్రధారులైతే తప్పనిసరిగా జైలుకెళతారని ఆయన హెచ్చరించారు.
ఐటీ అధికారులను టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఫ్యాక్షనిస్టుల్లా అభివర్ణించడంపై ఎంపి జివిఎల్ తీవ్రంగా స్పందించారు. ఐటి అధికారులు పేపర్లు, పెన్నులతో వస్తే.. వాళ్లు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఫ్యాక్షనిస్టుల్లా కనబడ్డారా?...అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించారని జీవీఎల్ విమర్శించారు.
మరోవైపు బిజెపి ఎంపి జివిఎల్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్పై మోడీ చెంచాలు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వస్తే జీవీఎల్కు వాళ్లే బుద్ధిచెబుతారని బుద్ధా హెచ్చరించారు. జీవీఎల్కు 200 కోట్ల అక్రమాస్తులున్నాయని ఆయన ఆరోపించారు.
Recommended Video
లోకేష్ తో చర్చకు సిద్దమంటున్న జీవీఎల్ స్థాయికి తాను చాలని...ఆయనతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమిత్షా కుమారుడికి కట్టబెట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. అమిత్షా ఆదేశాలతోనే రాంమాధవ్ రంగంలోకి దిగారని ఆరోపించారు. 'రాంమాధవ్..మీకు ధైర్యం ఉంటే నాపై మీపార్టీ అభ్యర్థిని నిలపండి' అంటూ బుద్దా వెంకన్న ఛాలెంజ్ చేశారు.
తనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ వస్తే విజయవాడ వదిలివెళ్లిపోతానని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. సీబీఐకి అవినీతి చీడ పట్టించిన చరిత్ర మోడీ, అమిత్ షాదని విమర్శించారు. టీడీపీ సింహాల పార్టీ అయితే బీజేపీ గుంటనక్కల పార్టీ అని బుద్దా వెంకన్న అభివర్ణించారు.