హోదాపై బాబుకు జైట్లీ హామీ: జగన్ రెచ్చగొట్టొద్దని పత్తిపాటి, దమ్ముందా అని నెహ్రూ
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల పైన వారం తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈలోగానే పన్ను రాయితీలను ప్రకటిస్తామని చెప్పారు.
సింగపూర్ పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు... బుధవారం నీతి ఆయోగ్ భేటీ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా తనను కలిసిన చంద్రబాబుకు జైట్లీ భరోసా ఇచ్చారు.
నీతి ఆయోగ్ సీఈఓ అరవింద్ పనగారియా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై తుది నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. నీతి ఆయోగ్ నిర్ణయం వెలువడే లోగానే రాష్ట్రానికి పన్ను రాయితీలకు సంబంధించి ప్రకటన చేస్తామన్నారు.
ఎవరూ లేనిచోట దీక్ష చేసుకో: జగన్కు పత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు తిరిగి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం ధ్వజమెత్తారు. ఎవరూ లేని చోట జగన్ దీక్ష చేసుకోవచ్చునని హితవు పలికారు.
ఆర్థిక అభివృద్ధి సంస్థతో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఢిల్లీలో ఆర్థిక అభివృద్ధి సంస్థ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక వనరుల సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలు, నిధుల వినియోగంపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
గవర్నర్కు ఏపీ కాంగ్రెస్ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో జరిగిన అక్రమాల పైన వారు ఫిర్యాదు చేశారు.
దమ్ముంటే దీక్షను అడ్డుకోండి: జ్యోతుల
దమ్ముంటే తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను అడ్డుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ గురువారం సవాల్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైసిపి దీక్షను తలపెట్టారన్నారు.
దీక్షను భగ్నం చేసేందుకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. గండేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన జగ్గయ్యపేట నియోజకవర్గ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ దీక్షను అడ్డుకోలేరని అభిప్రాయపడ్డారు.