చంద్రబాబు అరెస్టా ? ఛాన్సే లేదు - తేల్చేసిన బీజేపీ సత్యకుమార్..
రూ.118 కోట్ల రూపాయల లెక్కచూపని ఆదాయం వ్యవహారంలో ఐటీ నోటీసులు అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తన అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని, లేకుంటే దాడి చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. వీటిపై సొంత పార్టీ టీడీపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ కూడా స్పందించారు.
చంద్రబాబు అరెస్టు ప్రచారంపై ఇవాళ గుంటూరులో స్పందించిన సత్యకుమార్ .. ఆ అవకాశం లేదంటూ తేల్చేశారు. అదంతా ఒట్టి ప్రచారమే అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపైనే అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న సత్య కుమార్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపేందుకు ప్రజలు కలిసి రావాలని సత్యకుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలనను ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

రాష్ట్రాభివృద్ధిని పక్కనబెట్టి అవినీతిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని సత్యకుమార్ విమర్శించారు. మూడేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైన జగన్.. ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారని తెలిపారు. వైసీపీ సర్కార్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేస్తోందన్నారు. భూముల డిజిటలైజేషన్ కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించారని ఆరోపించారు. వీటిని జగనన్న భూరక్ష పేరుతో పాస్ పుస్తకాలపై తన ఫొటో వేసుకునేందుకు వాడుకున్నారన్నారు.ప్రజల ఆస్తుల మీద కన్నేసి కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చారని సత్యకుమార్ విమర్శించారు. గతంలో ఎవరూ ఇలాంటి ప్రజాకంటక పాలన చేయలేదన్నారు.
ఇప్పటికే చంద్రబాబు కు ఐటీ నోటీసులకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. అయితే ఇప్పుడు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సైతం చంద్రబాబును సమర్ధించేలా వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ ఈ ప్రచారాన్ని ఎలా తిప్పికొడుతుందన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications