ఆ విషయంలో టీడీపీని మించి పోయిన క్రెడిట్ కోసం బీజేపీ: క్రెడిట్ కోసం వైసీపీతో పోటీ
విశాఖపట్నం: రాష్ట్రానికి పలు సాఫ్ట్ వేర్ సంస్థలు, ఐటీ కంపెనీలు తరలివస్తోన్నాయి. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు విశాఖపట్నంలో తమ కార్యాలయాలను నెలకొల్పడానికి సన్నద్ధమౌతోన్నాయి. మరి కొన్ని ఐటీ ఇండస్ట్రీ బిగ్ షాట్స్ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.ఆయా కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు కూడా.

క్రెడిట్ కోసం..
పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నీ మధ్య ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య పెట్టుబడులు రావడానికి తామంటే తామే కారణమంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పోటీ పడుతున్నాయి. విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీలు రావడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలే కారణమంటూ వైసీపీ చెబుతోండగా.. దీనికి భిన్నమైన స్టేట్ మెంట్స్ ఇస్తోంది బీజేపీ.

తనంతట తానుగా..
బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మరో అడుగు ముందుకేశారు ఈ విషయంలో. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ తనంతట తానుగా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏమీ లేదని పేర్కొన్నారు. పైగా వైసీపీ నాయకుల వైఖరి, కమీషన్లు, ఇతర ధందాల వల్ల చాలా సంస్థలు పారిపోయాయని ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి సంబంధం లేదు..
తమ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోన్న నేపథ్యంలో- ఇన్ఫోసిస్ సంస్థ యాజమాన్యం దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో తన కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటోందని, కర్ణాటకలోని హుబ్లీని సైతం పెట్టుబడుల కోసం ఎంచుకుందని సత్యకుమార్ అన్నారు. అదే క్రమంలో విశాఖపట్నంలో కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని చెప్పారు. అంతే తప్ప- ఇన్ఫోసిస్ ను రాష్ట్రానికి రప్పించడంలో వైసీపీ ప్రభుత్వానికి గానీ, మంత్రి గుడివాడ అమర్నాథ్కు గానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

యువతకు మోసం..
దీన్ని వైసీపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని సత్యకుమార్ ఎద్దేవా చేశారు. గుడివాడ అమర్నాథ్ కు ఐటీపై తప్ప మిగిలిన వాటన్నింటిపైనా అవగాహన ఉందని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై మంత్రి గుడివాడ ఆరోపణలు చేయడంలో అర్థమే లేదని ధ్వజమెత్తారు. తమపై విమర్శలు, అర్థం లేని ఆరోపణలను చేయడం కంటే తన శాఖపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఐటీ సంస్థలు వస్తోన్నాయంటూ యువతను మోసం చేస్తోన్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications