టీడీపీ కనుమరుగు ఖాయం..ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తాం: జీవీఎల్
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలని, ఆ పార్టీ ఓటమి ఖాయమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటమి ఖాయమైందనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచిపోయి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ను మూసేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడం.. ఆయనలోని అభద్రతను సూచిస్తోందని అన్నారు.
చేయనిది చేసినట్టుగా ప్రజలను మభ్యపెట్టి, అయిదేళ్ల పాటు పాలన కొనసాగించారని విమర్శించారు. దాని ఫలితంగా- చంద్రబాబు దారుణ పరాజయాన్ని చవి చూడబోతున్నారని చెప్పారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం కేటాయించిన నిధులను ఇష్టానుసారంగా వాడుకున్నారని, రాజకీయ లబ్ది పొందడానికి ప్రజాధనాన్ని వ్యయం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో లెక్కలు అడగటం, అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచకపోవడం వంటి కారణాల వల్లే ఆయన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారని అన్నారు.
తమ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేసి, ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా వెదజల్లిన డబ్బు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్రం కేటాయించిన నిధులను చంద్రబాబు దారి మళ్లించి, రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టారని జీవీఎల్ ఆరోపించారు.
రౌడీయిజంతో ప్రజలను భయపెట్టారని, పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో, అన్నీ చేశారని మండిపడ్డారు. విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టి, మరోసారి అధికారంలోకి రావడానికి చంద్రబాబు తెగ ఆరాటపడ్డారని వ్యాఖ్యానించారు. ధన ప్రవాహంపై చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు మరింత సమయం ఉండి ఉంటే తమ పార్టీకి మంచి ఫలితాలు వచ్చేవని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో తెలుుగదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమైందని, ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తామని అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీని రూపుదిద్దుతామని అన్నారు.