ఏపీలో ఆ ఏకైక బీజేపీ ఎంపీ దారెటు ? మళ్లీ పాత బాస్ తో టచ్ లోకి ! 2024 కల్లా సొంత గూటికి!
ఏపీలో టీడీపీ తరఫున గెలిచిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు గతంలో బీజేపీలోకి ఫిరాయించారు. వారిలో సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి ఉన్నారు. వీరితో పాటు తెలంగాణకు చెందిన గరికపాటి మోహనరావు కూడా ఉన్నారు. అయితే వీరిలో సీఎం రమేష్ మినహా మిగిలిన వారంతా తాజాగా రిటైర్ అయిపోయారు. వీరిలో ఎవరికీ బీజేపీ మరో ఛాన్స్ ఇవ్వలేదు. అదే సమయంలో మిగిలిన సీఎం రమేష్ కూడా ఇప్పుడు తన భవిష్యత్తుపైనా క్లారిటీగా ఉన్నట్లు కనిపిస్తోంది.
సీఎం రమేష్ రాజకీయం
ఒకప్పుడు టీడీపీలో అధినేత చంద్రబాబుకు దగ్గరై ఆ పార్టీకి ఎన్నికల్లో అండగా నిలబడే స్ధాయికి ఎదిగిన సీఎం రమేష్ ఇదే క్రమంలో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. అయితే 2019లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత తోటి ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావుతో కలిసి బీజేపీలోకి ఫిరాయించారు. దీనికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఆమోదముద్ర వేయడంతో అప్పటి నుంచి బీజేపీ ఎంపీగా చెలామణి అవుతున్నారు. అయితే తాజాగా సీఎం రమేష్ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది.
టీడీపీతో టచ్ లోకి సీఎం రమేష్ ?
ఒకప్పుడు టీడీపీలో ఉండటం వల్ల లాభం లేదని భావించి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ దశలో అధినేత చంద్రబాబే ఆయన్ను వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ సీఎం రమేష్ మాత్రం దీనిపై నోరు మెదపలేదు. చివరికి బీజేపీలో కొనసాగుతూనే ఇప్పుడు ఆయన తిరిగి తన సొంత గూటివైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి తన బాస్, టీడీపీ అధినేత చంద్రబాబుతో సీఎం రమేష్ టచ్ లోకి వెళ్లిన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం రమేష్ భవిష్యత్ వ్యూహాలకు ఇప్పటినుంచే పదునుపెడుతున్నట్లు సమాచారం.
కేశినేని వ్యాఖ్యలతో తెరపైకి
వాస్తవానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అదే సమయంలో ఢిల్లీలో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ సీఎం రమేష్ వంటి వారి మాటలు వింటున్నారని ఆరోపించారు. ఆయన షిండేలా టీడీపీని చీలుస్తారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి వారిని చేరదీస్తే టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం కష్టమేనన్నారు. నాని ఆరోపణల ఆధారంగా చూస్తే సీఎం రమేష్ తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లే తెలుస్తోంది. అంతే కాదు మళ్లీ పాత బాస్ చంద్రబాబుకు సలహాలు కూడా ఇస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే కేశినేని వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవడంతో ఈ వ్యవహారంపై అనుమానాలు మరింత పెరిగాయి.
2024 నాటికి టీడీపీకి రిటర్న్ ?
ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ పదవీకాలం 2024 ఏప్రిల్ వరకూ ఉంది. ఆ తర్వాత ఆయన కూడా మాజీ ఎంపీ అయిపోతారు. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇందులో టీడీపీ గెలిచినా, గెలవకపోయినా బీజేపీ మాత్రం కనీస స్దానాలు గెల్చుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. అంతే కాదు తాను 2024 ఏప్రిల్లో రిటైర్ అయ్యాక మరోసారి ఎంపీగా బీజేపీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో ఇప్పటి నుంచే టీడీపీతో టచ్ లోకి వెళ్లి 2024లో తన పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.