పవన్ కళ్యాణ్ 'మహాకుట్ర'-ఆపరేషన్ గరుడ: 'శివాజీతో పలికించి, బాబుగారూ! ఏం ఐడియా, సాబ్జీ'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాటి నవ నిర్మాణ దీక్ష సందర్భంగా చేసిన ఆపరేషన్ గరుడ వ్యాఖ్యలపై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఆపరేషన్ గరుడకు చంద్రబాబే దర్శక, నిర్మాత, రచయిత అని విమర్శించారు.
Recommended Video
సోనియాతో ఏమైనా వ్యక్తిగత విభేదాలున్నాయా, మోడీయే ఎక్కువ మోసం: బాబు సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు తాను రాసుకున్న స్క్రిప్ట్ను నటుడు శివాజీతే చెప్పించి, ఆ తర్వాత ఆపరేషన్ గరుడ నిజమే కావొచ్చని మాట్లాడుతున్నారన్నారు. శివాజీతో పలికించడం, చంద్రబాబు ఇప్పుడు మాట్లాడటం అంతా కుట్రలో భాగంగానే కనిపిస్తోందన్నారు. ఈ మేరకు ఐవైఆర్ ట్వీట్ చేశారు.
పలికించి, పలికి.. ఏం ఐడియా సార్!
'ఆపరేషన్ గరుడకు తమరే నిర్మాత దర్శకులు రచయిత. ఒక నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనచే పలికించారు. ఈ రోజు నవనిర్మాణ దీక్ష లో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చనిసెలవిచ్చారు. ఏమి ఐడియా సాబ్జీ.' అని ఐవైఆర్ ట్వీట్ చేశారు.
ఐవైఆర్తో లైవ్-క్వశ్చన్ అండ్ ఆన్సర్
తాజాగా, ఆదివారం మరో ట్వీట్ కూడా చేశారు. ఎవరి రాజధాని అమరావతి పేరుతో జూన్ 4వ తేదీన పేస్బుక్ పేజీలో లైవ్ ఫీడ్ ఉంటుందని, సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఉంటుందని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. లైవ్ సందర్భంగా ప్రశ్నలను, కామెంట్లను పంపించాలన్నారు.
శివాజీ లేవనెత్తిన ఆపరేషన్ గరుడ
కాగా, కొద్ది రోజుల క్రితం నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై ఆపరేషన్ గరుడ ప్రయోగిస్తుందని, అందుకు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఆధారాలు చూపించలేదు. అయితే శివాజీ మాటలను లెఫ్ట్ పార్టీ సహా సీనియర్ నేతలు కొట్టి పారేశారు. మంచి సినిమా కథ చెప్పారని, అదో డ్రామాలా ఉందని వ్యాఖ్యానించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆపరేషన్ గరుడపై మాట్లాడుతూ.. శివాజీ, ఇది సినిమా కాదన్నారు. ఆ తర్వాత శివాజీ టీడీపీ దీక్షల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన వెనుక టీడీపీ ఉండి నడిపిస్తోందని తేలిపోయిందని విపక్షాలు చెబుతున్నాయి.
పవన్ కళ్యాణ్ 'మహాకుట్ర', ఆపరేషన్ గరుడ
ఆపరేషన్ గరుడ ఓ సినిమా కథలా ఉందని చెబుతూ, అందరూ దాదాపు మర్చిపోయిన సమయంలో మరోసారి చంద్రబాబు నాయుడు దానిని లేవనెత్తారు. శనివారం నవనిర్మాణ దీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ నిజంగానే ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. మహా కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ను ఉత్తరాంధ్రకు పంపి అక్కడ ఏదో జరిగిపోతోందని విమర్శలు చేయిస్తున్నారని, అందుకే ఆయనకు ముందు మంచిగా ఇప్పుడు చెడుగా కనిపిస్తున్నామని, ఏం సమాధానం చెప్పాలని, నేను ఆయనను విమర్శించడం లేదని, ఉత్తరాంధ్రను ఎంతో అభివృద్ధి చేశామని, మంచి ఫలితాలు వస్తున్నాయని, అయినా అక్కడకెళ్లి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, సినీనటుడు శివాజీ చెప్పినట్లు ఆపరేషన్ గరుడ... ఈ మహా కుట్ర ఒకటే అనిపిస్తోందని, మీ కుట్రలు మా దగ్గర కాదని, తెలుగుజాతి జోలికొస్తే ఖబడ్దార్, వదిలిపెట్టమని చంద్రబాబు అన్నారు. దీనిపై ఐవైఆర్ పైవిధంగా స్పందించారు.
దిగజారుడు రాజకీయం
ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు మాట్లాడి తన స్థాయిని మరింత దిగజార్చుకుంటున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఏపీ విభజనకు ముందు ఒక్కసారి కూడా పోలవరం ప్రాజెక్టు ఊసెత్తని చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రాజెక్టును గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి టీడీపీ వ్యవహార ధోరణి కారణమన్నారు. నవ నిర్మాణ దీక్షను ప్రభుత్వ ఖర్చుతో చేస్తూ పార్టీ ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకుంటున్నారన్నారు. అసలు టీడీపీ ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలన్నారు.