ఎన్నికల వేళ ఏపీలో కీలక నేతను సస్పెండ్ చేసిన బీజేపీ
సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రకటించింది. నిమ్మక జయరాజును పార్టీ నుంచి తొలగించడంపై రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక వెంకట సత్యనారాయణ రాజు ఓ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ ప్రతిష్టకు నష్టం చేకూరుస్తున్నారన్న కారణంగా వివరణ ఇవ్వాలని నిమ్మక జయరాజుకు నోటీసులు జారీ చేశామని..ఆ నోటీసులపై ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని, పైగా మరిన్ని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి రావడంతో నిమ్మక జయరాజును సస్పెండ్ చేశామని రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక వెంకట సత్యనారాయణ రాజు తెలిపారు. క్రమశిక్షణ గల పార్టీలో ఇటవంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు.

అరకు ఎంపీ అభ్యర్థిత్వంపై నిమ్మక జయరాజు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే ఆయన్ను పార్టీ బహిష్కరించింది. పొత్తులో భాగంగా అరకు ఎంపీ సీటు బీజేపీకి దక్కింది. అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీనిపై పార్టీ సీనియర్ నాయకుడు నిమ్మక జయరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తపల్లి గీత అసలు ఎస్టీనే కాదని..ఆమెకు ఎలా సీటు కేటాయిస్తారంటూ బీజేపీ నాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. దీనిపై మీడియాకు ఎక్కి నానా రచ్చ చేయడంతో ఆయనపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
నిమ్మక జయరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే నిమ్మక జయరాజు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. ఆయన ఎమ్మెల్యే ,ఎంపీగా పోటీ చేయడానికి సన్నద్దం అవుతున్నారు. 18న కురుపాం ఆర్వో కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేయనున్నారు. 19న ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. నిమ్మక జయరాజు గతంలో కురుపాం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.












Click it and Unblock the Notifications