పవన్ ను "ఫిక్స్" చేస్తున్న బీజేపీ - చంద్రబాబు రివర్స్ గేమ్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ ఏపీనే లక్ష్యంగా టీడీపీ, జనసేన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ కొత్త రాజకీయం మొదలు పెట్టింది. టీడీపీతో జత కట్టినా పవన్ విషయంలో తొందరపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీజేపీ ఎత్తుగడలను పసిగట్టిన చంద్రబాబు అలర్ట్ అయ్యారు. దీంతో, పవన్ కేంద్రంగా ఏపీలో ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరగుతోంది.
పవన్ కేంద్రంగా రాజకీయం
జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ తరువాత తాము టీడీపీతో జత కడుతున్నట్లు పవన్ ప్రకటించారు. కానీ, ఎన్డీఏలోనే కొనసాగుతున్నారు. బీజేపీ ఇప్పటి వరకు టీడీపీతో కలిసేందుకు ఎలాంటి సానుకూల సంకేతాలు ఇవ్వటం లేదు. పవన్ కల్యాణ్ మాత్రం తమ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ ఎన్నికల పైన చర్చల కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసారు. తెలంగాణకే చర్చలు పరిమితం అయ్యాయి. 2014లో ఏపీ -తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరగటంతో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసాయి. ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ, ఏపీ కంటే తెలంగాణ ఎన్నికలే ఇప్పుడు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
బీజేపీ కొత్త లెక్కలు
తెలంగాణలో జనసేన కంటే కొంత మేర బలంగా కనిపిస్తున్న టీడీపీతో పొత్తుకు బీజేపీ నో చెప్పింది. బలం తక్కువగా ఉన్న జనసేనతోనే కొనసాగాలని నిర్ణయించింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత మారుతున్న లెక్కలతో తెలంగాణలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణలోనే టీడీపీతో పొత్తు వద్దంటున్న బీజేపీ ఏపీలో అంగీకరించటం అనుమానంగానే ఉంది.
టీడీపీ తో పొత్తు ఉంటే తెలంగాణలో నష్టపోతామనే అభిప్రాయం కారణంగా చెబుతున్నా...బీజేపీ అధినాయకత్వం మూడ్ మాత్రం టీడీపీతో పొత్తుకు సిద్దంగా లేదనే చెబుతున్నారు. ఇదే సమయంలో పవన్ తమతో చర్చింకుండా టీడీపీతో పొత్తు ఖాయం చేసుకున్నా..ఇప్పటికిప్పుడు పవన్ ను దూరం చేసుకోకూడదనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో బీజేపీతో..ఏపీలో టీడీపీతో పొత్తు ద్వారా పవన్ ఓటర్లను ఏ విధంగా ఒప్పించగలుగుతారనేది మరో చర్చ.
చంద్రబాబు - పవన్ ప్లాన్ ఏంటి
బీజేపీ ఆలోచనలను గుర్తించిన చంద్రబాబు..వ్యూహాత్మకంగా పవన్ తనంతట తానే పొత్తు ప్రకటన..త్వరలో రెండు పార్టీల మేనిఫెస్టో ప్రకటించేలా పావులు కదిపారు. ఏపీలో బీజేపీ కంటే టీడీపీతో వెళ్లటమే రాజకీయంగా ఇప్పుడు పవన్ కు అవసరం. కానీ, వైసీపీకి మద్దతుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిలిస్తే తమకు నష్టమనే అభిప్రాయంతోనే బీజేపీతో కలిసి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీతో పొత్తు కొన్ని అంశాల్లో అవసరమే అయినా..టీడీపీలోని ఒక వర్గం మాత్రం అసలు ఆ పార్టీతో పొత్తు వద్దని వాదిస్తోంది. పవన్ కు సైతం బీజేపీకి అనుకూలంగా ఉండటం..ద్వారా పరోక్షంగా చంద్రబాబు పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. దీని ద్వారా పొత్తులు..సీట్ల లెక్కల్లో తన మాటకు ప్రాధాన్యత పెరిగేలా మలచుకుంటున్నారు. బీజేపీ ఏం చేసినా పవన్ టీడీపీని కాదని ముందుకు వెళ్లరనేది చంద్రబాబు నమ్మకం. ఇలా..ఈ రెండు పార్టీలు పవన్ కేంద్రంగా అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలు ఎవరికి కలిసి వస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications