జగన్ ఇలాకాలో మారుతున్న రాజకీయం- టీడీపీ ప్లేస్ భర్తీ చేస్తున్న బీజేపీ- టార్గెట్ 2024
2019 ఎన్నికల్లో టీడీపీని వైట్ వాష్ చేసేసిన సంతోషం వైసీపీకి ఎక్కువ రోజులు మిగిలేలా కనిపించడం లేదు. ముఖ్యంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు అధికార పార్టీని మరో భయం వెంటాడుతోంది. టీడీపీ ప్రాధాన్యం కోల్పోవడంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతుండటం జగన్ కు చికాకుగా మారింది. టీడీపీ తరహాలో బీజేపీని టార్గెట్ చేయలేక సీఎం జగన్ నిస్సహాయంగా చూస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ టార్గెట్ కడప....
దేవుని గడపగా చెప్పుకునే కడప జిల్లా నుంచే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాలని బీజేపీ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో మారిన పరిస్దితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ.. అందులో కొంత మేరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో కోస్తా, ఉత్తరాంధ్రతో పోలిస్తే రాయలసీమలోనే తమకు అనుకూల పరిస్ధితులు ఉన్నాయని భావిస్తున్న బీజేపీ నేతలు.. అందులోనూ కడపను తమ కార్యస్ధలిగా ఎంచుకోవడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు అర్దమవుతోంది.

జగన్ బాధితులు- కీలక నేతలపై వల...
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాయలసీమలో, అందులోనూ కడప జిల్లాల్లో వైసీపీ అధినేత జగన్ కు టార్గెట్ అవుతారని భావించిన నేతల్లో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ముందు వరుసలో ఉన్నారు. వ్యాపారాలతో పాటు మిగతా భయాలతో వీరిద్దరూ జగన్ సర్కారు ఏర్పడగానే బీజేపీలో చేరిపోయారు. తద్వారా సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్లే భావిస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత కూడా మొదట్లో జగన్ తనను టార్గెట్ చేస్తారని భావించిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తద్వారా జగన్ నుంచి తనకే ముప్పు లేదనే అంచనాకు ఆదినారాయణరెడ్డి వచ్చేశారు. ఇక జిల్లాలో మరికొందరు నేతలను కూడగట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నారు.

టీడీపీ శూన్యత భర్తీ....
కడప జిల్లా రాజకీయాల్లో గతంలో కాంగ్రెస్ తో, ఆ తర్వాత వైసీపీతో సై అంటే సై అనే పరిస్ధితుల్లో ఉన్న టీడీపీ... ఆధిక్యాన్ని మాత్రం సాధించలేకపోయింది. అయితే గతంలో ఎన్నడూ లేని స్దాయిలో కీలక నేతలందరినీ వైసీపీకి కోల్పోయిన టీడీపీకి ఇప్పుడు బీజేపీ రూపంలో మరో సమస్య వచ్చిపడింది. ఇదే అదనుగా టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను చేరదీసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కడప జిల్లాలో గతంలో టీడీపీ నేతలుగా ఉన్న వారంతా ఇప్పుడు వైసీపీ లేదా బీజీపీ పంచన చేరిపోతున్నారు. దీంతో మారుతున్న పరిస్ధితుల్లో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అన్న భావనను ఓటర్లలో కల్పించడంలో బీజేపీ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.
Recommended Video

జగన్ నిస్సహాయత....
గతంలో టీడీపీ నేతలను నయానో భయానో లొంగదీసుకునేందుకు అవకాశం ఉండటంతో సీఎం జగన్ ఆ మేరకు వారిని పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ నేతలను అదే స్ధాయిలో భయపెట్టడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అదే సమయంలో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తే అధిష్టానానికి కూడా తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంటుంది. బీజేపీ హిందూత్వ అజెండా ఎలాగో ఉండనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని దేవాలయాల విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని హైలెట్ చేస్తున్న బీజేపీని రాయలసీమలో టార్గెట్ చేయాలని చూస్తే అది మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే సీమలో చొచ్చుకొస్తున్న బీజేపీని ఏమీ చేయలేక, కనీసం సొంత జిల్లాల్లోనూ ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటి నేతలను ఏమీ అనలేని పరిస్ధితుల్లో సీఎం జగన్ నిస్సహాయంగా చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications