పవన్ చెప్పారు కానీ, ఇక ఆటలు సాగవ్, కేసులు పెడతామని బెదిరించారు: మోడీ దుమ్ముదులిపిన బాబు
విజయవాడ: ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీన వదిలిపెట్టేది లేదని హక్కులు సాధించుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం మహానాడులో అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై తాము ధర్మపోరాటం చేస్తున్నామని చెప్పారు. వైసీపీ ఎంపీలు రాజీనామా పేరుతో నాటకాలు ఆడుతున్నారని, రాజీనామాలు ఆమోదించినా ఎన్నికలు రావని వారికి తెలుసునని చెప్పారు.
జనసేనకే మద్దతు: దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే భార్య, బాబు పట్టించుకోవట్లేదు, మీరైనా: మోడీకి పవన్
హక్కుల కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నామన్నారు. హామీలు ఎందుకు అమలు చేయలేదో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. తప్పుడు మార్గాలతో మనలను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందన్నారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు వీరోచితంగా పోరాడారన్నారు. ఐటీ, సీబీఐ కేసులు పెడతామన్నా భయపడలేదన్నారు. ప్రజల కోసం టీడీపీ ఎంపీలు త్యాగాలకు సిద్ధపడ్డారన్నారు.
పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ రాలేదు
ఇప్పుడు బీజేపీకి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తేడా లేదని చెప్పారు. రెండు పార్టీలు ఏపీని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకసభలో అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పిందని, కానీ వారి తీరు చూసి టీడీపీయే పెట్టిందన్నారు. మీరు అవిశ్వాస తీర్మానం పెడితే నేను అందరి సహకారం మీకు వచ్చేలా చేస్తాననిజనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని కానీ రాలేదని చంద్రబాబు చెప్పారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ తర్వాత ముందుకు కదలలేదని అభిప్రాయపడ్డారు. కుట్ర రాజకీయాలకు తెరదీశారన్నారు. ఈ రోజు బీజేపీ, వైసీపీల అంశం తేలాల్సి ఉందన్నారు. లాలూచీ రాజకీయాలు తేలాల్సి ఉందన్నారు.
ఏపీలో మోడీపై 100 శాతం అసంతృప్తి ఉండాలి, కర్ణాటకలో వైసీపీ ప్రచారం
ఇటీవల జరిగిన సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీపై తమిళనాడులో 75 శాతం, ఏపీలో 65 శాతం అసంతృప్తి ఉన్నట్లుగా వెల్లడైందన్నారు. కానీ మోడీ పైన 100 శాతం అవిశ్వాసం ఉండాల్సి ఉందన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ భావితరాల కోసం ఆలోచిస్తే, వైసీపీ కేసుల మాఫీ కోసం చూస్తోందన్నారు. కర్ణాటకలో సిగ్గులేకుండా బీజేపీకి ఓటేయమని వైసీపీ ప్రచారం చేసిందన్నారు.
సీబీఐ, ఇన్కం ట్యాక్స్ కేసులు పెడతామని బెదిరించారు
బడ్జెట్లో ఏపీకి నష్టం జరిగిందని తాము నిలదీశామని చంద్రబాబు అన్నారు. కేసులు పెడతామని బెదిరించారని, మామూలు కేసులు కాదని, ఇన్కం ట్యాక్స్, సీబీఐ తదితర కేసులు పెడతామని బెదిరించారని, కానీ మా రాష్ట్ర ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పామని చంద్రబాబు అన్నారు. రాజకీయాల కోసం మతవిద్వేషాలను రెచ్చగొట్టవద్దన్నారు. వైసీపీకి విశ్వసనీయత లేదన్నారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో మోడీని ఏమీ అనడం లేదన్నారు. అగ్రవర్ణ పేదలకు కార్పోరేషన్ ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లో, స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తెస్తానని చెప్పిన ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు అవినీతిపరులను దగ్గరకు తీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.
ఓ వైపు జగన్, మరోవైపు పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు
మనలను ఓ వైపు వైసీపీ, మరోవైపు పవన్ కళ్యాణ్ తిడుతున్నారని, కానీ ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నిన్న కూడా తిట్టారని ఉద్ధానం ఇష్యూను ఉద్దేశించి చెప్పారు. తాము స్క్రీనింగ్ టెస్టులు చేశామని, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చారు. ఉద్దానం విషయంలో 17 అంశాలను చెబుతూ పవన్ ఒక్కరోజు దీక్ష చేయడంతో సీఎం పైవిధంగా స్పందించారు. ఇంత చేస్తున్నా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
బీజేపీకి ఎవరు సహకరించినా.. మనకు రోషం లేదా?
ఏపీకి న్యాయం చేసే వరకు బీజేపీకి ఎవరు సహకరించినా వారు రాష్ట్ర ద్రోహులు అవుతారని చంద్రబాబు అన్నారు. తమిళనాడును మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత దారుణం జరుగుతుంటే మనకు రోషం లేదా అని ప్రశ్నించారు. విభజన హామీలు రాష్ట్ర హక్కు అని, బిక్ష కాదన్నారు. కేంద్రానికి సహకరించే ఎవరినైనా వారిని రాష్ట్ర ద్రోహులుగా చూడాలన్నారు. పోరాటంలో కలిసి వచ్చే వారితో ముందుకు సాగుతామన్నారు.
మనం చెప్పినవాళ్లే ప్రధానమంత్రి
ఏపీ హక్కులపై సంవత్సరమైనా పోరాడుదామని, ఆ తర్వాత 2019లో ఏ ప్రభుత్వం కోరుకుంటే కేంద్రంలో అదే ప్రభుత్వం వస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి రాదన్నారు. అందరిని కలుద్దామన్నారు. ఇటీవల తనను చూసి కొందరు ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారని భావిస్తున్నారని, కానీ తనకు అలాంటి ఆలోచనలు లేవని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేంద్ర రాజకీయాల్లో మనం కీలక పాత్ర పోషిస్తాం తప్ప ప్రధాని కావాలనే ఆలోచన లేదన్నారు. నాడు గుజరాత్ ఘటన తర్వాత నేను వ్యతిరేకించానని చెప్పారు. ఇటీవల ట్రిపుల్ తలాక్ విషయంలోను తాను ప్రశ్నించానని చెప్పారు.
ఇక మీ ఆటలు సాగవు
ఈ రోజు కొందరు మతాలను, ప్రాంతాలను, కులాలను రెచ్చగొడతారని చంద్రబాబు అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏపీపై కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారని, కానీ మీ ఆటలు సాగవని చంద్రబాబు అన్నారు. బీజేపీతో పాటు కుట్రదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, మీ ఆటలు సాగవని, ఖబడ్దార్ అని హెచ్చరించారు. మిమ్మల్ని ప్రజలు అసహ్యించుకుంటారనే విషయం గుర్తించాలన్నారు. ప్రజల హక్కుల కోసం మేం ఆ రోజు పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు వాటిని నెరవేర్చనందుకు నిలదీస్తున్నామన్నారు. ఓ సీనియర్ నాయకుడిగా సామ, దాన, బేధ, దండోపాయాలతో ముందుకు సాగానన్నారు.