వెంటనే కేంద్రమంత్రిగా రాజీనామా చేస్తా: అశోక్, ఎంపీకి బాబు క్లాస్, బీజేపీతో తెగదెంపులే
Recommended Video
అమరావతి: కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే ఉత్తమమని, మన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయిద్దామని టీడీపీ ఎంపీలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎదుట కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది. శుక్రవారం టీడీపీ ఎంపీలు, మంత్రులతో చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే.
షా వద్దకు.. ఫలించని వెంకయ్య చొరవ: 'ఫార్ములా' చెప్పాం కానీ.. బాబుకు షాక్, జైట్లీ సంచలనం
సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో చంద్రబాబు, ఎంపీలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వైదొలుగుదామన్నారు. అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో పోరాడాలని, చివరి అస్త్రంగా రాజీనామాలు ఉండాలని భేటీలో చెప్పారు.
మాకు అదే ఇబ్బందిగా మారింది
బడ్జెట్లో అన్యాయం, ఏపీకి ఇచ్చిన హామీలపై తొలి విడతలో ఆందోళనలు నిర్వహించినా, మార్చి 5 వరకు గడువు విధించినా కేంద్రంలో ఎలాంటి కదలిక లేదని ఈ భేటీ సందర్భంగా ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. మన ఎంపీలు ఆందోళన చేయడం, అదే సమయంలో తాము (సుజన, అశోక్) మంత్రులుగా ఉండటం ఇబ్బందికరంగా మారిందని అశోక్ గజపతి రాజు చెప్పారు. ఆదేశిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తామని సుజనా చెప్పారు. అయితే ఇప్పుడు రాజీనామా వద్దని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామని, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారన్న భావన ప్రజల్లో రావొద్దన్నారు.
రాజీనామా చేస్తే ప్రతిపక్షంలా చూస్తారు
ఇప్పటికిప్పుడు కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే బీజేపీ.. టీడీపీని మరో ప్రతిపక్షంలా చూస్తుందని, కాబట్టి రాష్ట్రాన్ని న్యాయం జరిగేలా పోరాడాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఒకేసారి అస్త్రాలు అన్ని ఉపయోగించకుండా దశలవారిగా ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 5న ఎంపీలు ప్లకార్డులతో వెల్లోకి వెళ్తారని, ఆ తర్వాత ఆర్థిక బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తారని, ఫలితం లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. కార్యాచరణపై ఎప్పటికప్పుడు నిర్ణయం ఉంటుందన్నారు. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు చంద్రబాబు లేఖలు రాయాలని నిర్ణయించారు.
వైసీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చ
వైసీపీ అవిశ్వాస తీర్మానంపై భేటీలో చర్చ జరిగింది. వాళ్ల నిర్ణయం వాళ్లు తీసుకున్నారని, అదే దారిలో మనం వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు. వైసీపీకి ఎవరు మద్దతిస్తారనే చర్చ జరిగింది. అదే సమయంలో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ డిక్లరేషన్ అంటూ బీజేపీ ఉప ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం సరికాదని చంద్రబాబు అన్నారు. రేపు ఉత్తరాంధ్ర ప్రజలను కూడా రెచ్చగొడతారా అని మండిపడ్డారు.
పదవులు పట్టుకొని వేళ్లాడుతున్నారని
టీడీపీ పదవులు పట్టుకొని వేళ్లాడుతోందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఎంపీ మురళీ మోహన్ భేటీలో అన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. మనకు ఈ రెండు కేంద్రమంత్రి పదవులు ఎందుకు అని, వాటి వల్ల ఏమొచ్చిందని, అవేమైనా ప్రధానా శాఖలా, పట్టుకొని వేళ్లాడటానికి అన్నారు. మన వద్ద ఉన్న ఆయుధాలు ఎంపీలు, మంత్రులేనని వాళ్లతో రాజీనామాలు చేయించడమంటే ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడమే అని ఎంపీ కొనకళ్ల అన్నారు.
టీజీ వెంకటేష్కు క్లాస్
రాయలసీమలో రెండో రాజధాని డిమాండుకు మద్దతుగా ఎందుకు మాట్లాడారని ఎంపీ టీజీ వెంకటేష్కు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే తన మాటలను మీడియా వక్రీకరించిందని, ఉన్న రాజధానికి పూర్తిగా నిధులు ఇచ్చాక ఆ డిమాండ్ పెట్టమని మాత్రమే తాను అన్నానని ఆయన చెప్పారు. పత్రికలు అలా రాస్తే ఖండన ఇవ్వాలని, అవసరమైతే పరువునష్టం దావా వేయాలని కూడా సీఎం సూచించారు.
సవరణలు చేయకుంటే కటీఫ్
కేంద్ర బడ్జెట్లో కొన్ని సవరణల కోసం టీడీపీ ఎంపీలు ప్రతిపాదనలు చేస్తారు. వాటిని ఆమోదించకుంటే బీజేపీకి కటీఫ్ చెప్పాలని ఎంపీలు అందరూ చంద్రబాబుతో చెప్పారు. దాదాపు అదే నిర్ణయంతో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అరుణ్ జైట్లీ మాట్లాడిన ఫార్ములాపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థికలోటు భర్తీకి కేంద్రం మనకు ఏం ఫార్ములా ఇచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. అసలు వాళ్లు ఏ ఫార్ములా ఇవ్వలేదన్నారు. మనలను ఫార్ములా చెప్పమన్నారని, అది సరికాదని చంద్రబాబు భేటీలో అభిప్రాయపడ్డారు.