నలుపు భయం ఎవరిది ? సీఎం జగన్ దా ! అధికారులదా ! అసలేం జరుగుతోంది?
ఏపీలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటున్న సభలకు భద్రత పెరుగుతోంది. అదే స్ధాయిలో ఆంక్షలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నల్ల దుస్తులు వేసుకున్న వారిని, నల్లచున్నీలు వేసుకున్న మహిళలను వాటిని తొలగించేవరకూ పట్టుబట్టడం, లేదంటే వెనక్కి పంపేయడం వంటివి చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో సీఎం జగన్ ఎన్నో బహిరంగసభలు నిర్వహించినా ఇలాంటి పరిస్ధితి లేదు. మరి ఓవైపు ఎమ్మెల్యేలు గడప గడపకూ ప్రభుత్వం పేరుతో జనంలోకి వెళ్తున్న వేళ జగన్ మాత్రం ఇలా నలుపు రంగుకు భయపడుతున్నారా లేక అధికారులే అత్సుత్సాహంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది.
జగన్ సభల్లో నలుపు కనిపించొద్దు!
ఈ మధ్య రాష్ట్రంలో జరుగుతన్న సీఎం జగన్ పాల్గొంటున్న బహిరంగసభల్లో నలుపు రంగు కనిపించకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. జగన్ సభల్లో పాల్గొనేందుకు నల్లదుస్తులు వేసుకుని వచ్చే వారిని దూరంగా ఉంచేస్తున్నారు.
నల్లచున్నీలు వేసుకుని వచ్చే మహిళల్ని వాటిని అక్కడే వదిలేసి సభా ప్రాంగణంలోకి వెళ్లమని ఆంక్షలు విధిస్తున్నారు. నిరాకరించిన వారిని సభ నుంచి వెనక్కి పంపేందుకు కూడా అధికారులు వెనుకాడటం లేదు. దీంతో ఈ నలుపురంగు సమస్య కొత్తగా ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై చర్చ మొదలైంది.
నిరసనల భయమా ? దాడుల ముప్పా?
సాధారణంగా ఏ బహిరంగసభలకు అయినా వచ్చేవారిలో ఎంతో కొంత మంది నల్లదుస్తులు వేసుకుని రావడం సహజమే. పురుషులైతే నల్ల చొక్కాలు, టీషర్టులు, మహిళలైతే నల్ల చీరలు కట్టుకుని రావడం, యువతులైతే నల్లచున్నీలు ధరించడం సర్వసాధారణమే. అయితే ఇప్పుడు కొత్తగా నల్ల దుస్తులు వేసుకుని వచ్చే వారిని సీఎం జగన్ పాల్గొంటున్న సభల్లోకి అనుమతించకుండా దూరం పెట్టేయాలన్న నిర్ణయం వెనుక ఏముందో ఎవరికీ అర్ధం కావడం లేదు. జగన్ సభల్లో ఇలా నల్లదుస్తులు వేసుకుని వచ్చే వారు నిరసనలకు దిగుతారన్న భయాలు కానీ లేక దాడులకు దిగుతారన్న భయంతోనే వీరిని అలా అడ్డుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది.
ఇంతకీ నలుపు భయమెవరిది?
సీఎం జగన్ పాల్గొంటున్న బహిరంగసభలకు నల్లదుస్తులు వేసుకుని వచ్చేవారిని రానీయకుండా అడ్డుకోవడం వెనుక భయం ఎవరిదన్న చర్చ కూడా సాగుతోంది. నల్లదుస్తులు వేసుకుని వచ్చే వారితో తనకు ముప్పు ఉందని సీఎం జగన్ స్వయంగా భావిస్తున్నారా లేక నిఘా వర్గాలు ఆ మేరకు నివేదికలు ఇచ్చాయా అన్నది స్పష్టం కాలేదు.
అయితే సీఎం జగన్ నుంచి ఆదేశాలు లేకుండా ఇలా అధికారులు ఇలాంటి కొత్త ఆంక్షలు విధించే ధైర్యం చేయలేరు. ఒకవేళ చేసినా వివాదం నెలకొన్న తర్వాత అయినా అధికారులు స్పష్టత ఇచ్చేవారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ అనధికారిక నలుపు నిషేధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.