జగన్ గెలిచిన మరుసటి రోజే వైఎస్ విగ్రహాలకు రక్తాభిషేకాలా? ఏం జరుగుతోంది ఏపీలో?
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఏ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందనేది తెలియట్లేదు. ఇలాంటి చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాయనే విమర్శలు ఉన్నాయి.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలు కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎదురుగా గొర్రెను కోశారు. అక్కడితో ఆగి పోయి ఉంటే బాగుండేది. ఓ అడుగు ముందుకేశారు. గొర్రె రక్తాన్ని ఓ గిన్నెలో పట్టుకుని, వైఎస్ విగ్రహానికి అభిషేకం చేశారు. తలపై నుంచి ధారగా పోశారు. దీనితో విగ్రహం మొత్తం రక్తంతో తడిచింది.
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల్లో ఒకరు దీన్నంతటినీ సెల్ఫోన్ ద్వారా వీడియో తీశారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైఎస్ను తాము దేవునిగా భావిస్తామని, అందుకే ఆయన విగ్రహం వద్ద జీవాన్ని బలి ఇచ్చి, నైవేద్యంగా పెట్టామని కామెంట్స్ పెట్టారు. సాధారణంగా ఇలాంటి చర్యలు అమ్మోరి జాతరల్లో కనిపిస్తుంటాయి. జాతర్లలో కూడా అమ్మవారి ఆలయం ఎదురుగా జీవాలను బలి ఇస్తారే తప్ప, రక్తాభిషేకం చేయరు.
దాన్ని మించిపోయి వైఎస్ విగ్రహంపై రక్తాన్ని ధారగా పోయడం, దాన్ని వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. గొర్రెను బలి ఇవ్వడం వరకైతే తప్పు పట్టలేమని, ఆ రక్తంతో విగ్రహాన్ని అభిషేకించడం సరికాదంటూ తమ అభిప్రాయలను వెల్లడిస్తున్నారు పలువురు నెటిజన్లు.
వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారిని కొంత వరకు ప్రభావితం చేయడానికి అవకాశం ఉందని, ఇలాంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం వైఎస్ఆర్ సీపీ యంత్రాంగానికి ఉందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి దురభిమానం భవిష్యత్తులో పార్టీకి చేటు కలిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ హితబోధ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించకూడదని సూచిస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి అన్ని వర్గాల వారూ దోహదం చేశారని, ఇలాంటి రక్తతర్పణ చర్యల వల్ల కొన్ని వర్గాలు పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇలాంటి చర్యలు పౌర సమాజాంలో ఎలాంటి సంకేతాలను పంపిస్తాయనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.