రాయలసీమలో టీడీపీకి పరాభవం: 'టీచర్ ఎమ్మెల్సీ'లో ప్రత్యర్థులదే పైచేయి
కత్తి నరసింహారెడ్డి దూకుడు ముందు సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చ పుల్లయ్య కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడ్డారు.
చిత్తూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో మాత్రం ఎదురుదెబ్బ తప్పట్లేదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ లో టీడీపీ పలు చోట్ల వెనుకబడిపోయింది.
ముఖ్యంగా రాయలసీమలో టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. తూర్పు రాయలసీమ( చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ(అనంతపురం, కడప, కర్నూలు) నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు పరాభవం తప్పలేదు.

తూర్ప రాయలసీమలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడిపై 3,545 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, టీడీపీ అభ్యర్థి బచ్చలపుల్లయ్యపై విజయం సాధించారు. కత్తి నరసింహారెడ్డి దూకుడు ముందు సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చ పుల్లయ్య కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడ్డారు.
మొత్తం 3,763ఓట్ల మెజారిటీతో కత్తి నరసింహారెడ్డి బచ్చ పుల్లయ్యపై విజయం సాధించారు. ఇదిలా ఉంటే, ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ, పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.
టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో 2,633 కోట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇక పశ్చిమ రాయలసీమలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి 3,900 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications