జగన్కు ఝలక్: టీడీపీలోకి ఎమ్మెల్సీ బొడ్డు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భాస్కర రామారావు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. బొడ్డు భాస్కర రామారావు సొంతగూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెండో దశ రుణమాఫీని పక్కాగా అమలుచేస్తామని చంద్రబాబు చెప్పారు.
కాగా, గతంలో ఈయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా పదవులు నిర్వహించారు. గత ఎన్నికల ముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు వెంకటరమణ చౌదరికి రాజమండ్రి పార్లమెంటు టికెట్ కోసం ఆయన జగన్ వైపు వెళ్లారనే వాదనలు వినిపించాయి.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మంగళవారం ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉండటంతో బొడ్డు చేరిక ఒకరోజు వాయిదా పడింది. భాస్కర రామారావుతోపాటు ఆయన అనుచరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు.