బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక, అసత్యాల పుట్ట, ప్రభుత్వం చెప్పిందే బొంకింది: చంద్రబాబు
బోస్టన్ కమిటీ రిపోర్ట్ అసత్యాల పుట్టగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నివేదిక చెత్త కాగితమని, ప్రభుత్వం చెప్పిందే బొంకిందని విమర్శించారు. కన్సల్టెన్సీ నిజాలు చెప్పలే గానీ అబద్దాలు వల్లెవేయొద్దన్నారు. బోస్టన్ కమిటీకి తలాతోక లేదని విమర్శించారు. బీసీజీ కన్సల్టెన్సీ అని చెప్పేందుకు సిగ్గుపడాలి అని.. తప్పుడు పనులు చేసి.. 5 కోట్ల మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. విభజన చట్టం లేని ప్రతిపాదనను బీసీజీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రతిబింబించేలా నివేదిక ఉంటే.. విశ్వసనీయత పెరిగేదని.. కానీ బీసీజీ అలా చేయలేదని చంద్రబాబు విమర్శించారు. బీసీజీ నివేదిక తప్పుల తడక అని, అసత్యాలు చెప్పించారని మండిపడ్డారు.

పండితుడా..
విజయ్కుమార్పై కూడా విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు. నివేదికను చదివి అర్థం చేసుకొని మాట్లాడేందుకు తనకే ఒకరోజు సమయం పట్టిందని చెప్పారు. కమిటీ నివేదిక ఇచ్చిన అరగంటలో మాట్లాడేంత ప్రావీణ్యం ఉందా అని అడిగారు. అంత మేధావి లేదంటే అనుభవం ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్సినట్టే కమిటీ నివేదిక ఇచ్చినందున.. వారం రోజుల ముందునుంచే విజయ్ కుమార్ ప్రాక్టీస్ చేసి మీడియా ముందుకొచ్చారన పేర్కొన్నారు.

నాలుగు నుంచి ఆరు జోన్లు
జీఎన్ రావు కమిటీ నాలుగు జోన్లు అంటే, బీసీజీ ఆరు జోన్లు అని చెబుతోంది. ఈ రెండు కమిటీలను హై పవర్ కమిటీ అధ్యయనం చేస్తోందట అని చంద్రబాబు సెటైర్లు వేశారు. బీసీజీ కమిటీకి తలాతోక లేదని చంద్రబాబు విమర్శించారు. ప్రకాశం జిల్లాకు రూ.25 వేల కోట్లతో పేపర్ మిల్లు తీసుకొచ్చామని, తిరుపతిలో 15 వేల కోట్ల రిలయన్స్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే వెనక్కి పంపించలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

రెండు జిల్లాలే..
ఫర్ క్యాపిట ఇన్ కం తక్కువ ఉన్న జిల్లాలో ఏపీలో ఐదు ఉండేవని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ తమ హయాంలో శ్రీకాకుళం, విజయనగరం మాత్రమే మిగిలాయని చెప్పారు. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే అవీ కూడా వృద్ధి సాధించేవని తెలిపారు. 2009లో అమరావతి ముంపునకు గురైందని తప్పుడు నివేదికలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎన్జీటీ చెప్పిన ఆర్డర్ కాపీని మీడియాకు చూపించారు.

విశాఖలోనే మకాం
2016లో హుదూద్ తుఫాన్ వస్తే తాను విశాఖపట్టణంలోనే ఉన్న సంగతిని గుర్తుచేశారు. ప్రీ హుదూద్, పోస్ట్ హుదూద్ పరిస్థితిని ఒక్కసారి చూడాలని కోరారు. తొమ్మిది రోజులు అక్కడే ఉండి పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అమరావతి వచ్చిన సంగతి బీసీజీ కమిటీకి గుర్తులేదా అని ప్రశ్నించారు. తర్వాత మెగా సిటీ దిశగా అడుగులు వేసిందని చెప్పారు. విపత్తుల దృష్ట్యా అండర్ గ్రౌండ్ కేబుల్ వేశామని, దీంతో నిరాంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందన్నారు.

మునిగిన కర్నూలు..
2009లో కూడా కర్నూలులో వరదలు వచ్చాయని, ఆ సమయంలో టీడీపీ సాయం చేసిందని చంద్రబాబు చెప్పారు. లక్ష మంది ప్రజలకు ఆర్థికసాయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందన్నారు. ఆ సమయంలో జగన్ ఎక్కడున్నారో తనకు తెలియదన్నారు. కానీ తాము అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నామని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications