బాబు తీరుతో బాధేస్తోంది, వైయస్ కూడా ఎమ్మెల్యేలకు ఇలా కప్పలేదు: బొత్స
హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆదివారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న రాజకీయాలతో బాధ కలుగుతోందన్నారు. బాబులాంటి వారి వల్ల రాజకీయాలు అంటే చులకన భావం ఏర్పడుతోందన్నారు.
ప్రజల్లో రాజకీయాల పట్ల చులకన భావం ఏర్పడుతోందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బాధ వేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనైతికమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విపక్ష ఎమ్మెల్యేలకు టిడిపి పార్టీ కండువా కప్పుతున్నారన్నారు.
విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు కండువా కప్పుతున్నా, స్పీకర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి బలం ఉన్నప్పటికీ విపక్ష ఎమ్మెల్యేలకు కండువా కప్పడం విడ్డూరమన్నారు. ఇలాంటి రాజకీయాల వల్లనే రాజకీయాలు అంటే ప్రజలకు ఏహ్యభావన పెరుగుతోందన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే గౌరవభావం తగ్గిపోతోందన్నారు. తమకు ప్రజల ఆమోదం ఉందని, అభివృద్ధి పనుల వల్లనే ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తున్నారని అధికార పార్టీ చెప్పడం ఓ మైండ్ గేమ్ అన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం విడ్డూరమన్నారు. చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు.
నిజంగానే ప్రజల ఆమోదం ఉంటే, అభివృద్ధి పనుల కోసమే చేరితే.. వారితో రాజీనామా చేయించి, తిరిగి గెలిపించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కచ్చితంగా రాజీనామా చేయాలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా పార్టీ కండువాలు కప్పలేదన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు కండువా కప్పిన సందర్భాలు లేవన్నారు.