బొత్స కొత్త పార్టీ : 'తీసేసిన తహశీల్ధార్లు', ఎవరాడిన వెటకారమిది!
విజయనగరం : విజయనగరం జిల్లా రాజకీయాలతో పాటు కాపు సామాజిక వర్గంలోను బలమైన నేతగా ఎదిగారు బొత్స సత్యనారాయణ. మొన్నటిదాకా కాంగ్రెస్ లోనే కొనసాగిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులన్నీ కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారడంతో వైసీపీ కండువా కప్పేసుకున్న సంగతి తెలిసిందే.
వైసీపీలోను క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో పార్టీ తరుపున ముందుంటున్నారు. అధికార పార్టీకి కౌంటర్ ఎటాక్ లతో పార్టీ తరుపున గట్టిగా సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. బొత్స లాంటి నేతలను నిలువరించడానికి టీడీపీ కొత్త అస్త్రాలను సంధిస్తోంది.
ఈ క్రమంలో బొత్సకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఆసక్తికర వార్త ఏంటంటే.. "బొత్స కొత్త పార్టీ". అయితే ఇదేదో ఆయన చెప్పిన మాట కాదు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య బొత్స మీదకు వదిలిన వ్యంగ్యాస్త్రం. బొత్సను ఎద్దేవా చేస్తూ మాట్లాడిన గోరంట్ల.. రాష్ట్రంలో కొత్త పార్టీ రాబోతుందని, త్వరలో ఏర్పడబోయే ఆ పార్టీ పేరు 'తీసేసిన తహసీల్దార్లు' అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. రెండు రోజుల క్రితం ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
బొత్సతో పాటు మరికొందరు నేతలు జగన్ ను నమ్ముకుని ఏదో చేసేద్దామని.. వైసీపీలోకి వెళ్లారని, ఇప్పుడది సాధ్యం కాకపోవడంతో.. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారట గోరంట్ల. ఇదంతా చూశాక.. వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టడంలో రాజకీయ నేతలకు మరెవరు సాటి లేరేమో! అన్నది జనం వ్యక్తం చేస్తోన్న అభిప్రాయం.