అందుకే టీచర్లను ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించాం ! క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ..
ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో టీచర్లు బోధనకే పరిమితం అవుతారని, బోధనేతర విధుల నుంచి తొలగించడం వల్ల వారిపై ఒత్తిడి కూడా తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే విపక్షాలు మాత్రం టీచర్లను ఎన్నికల విధుల్లో నుంచి తొలగించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగో టీచర్లు తమకు సహకరించరనే క్లారిటీకి వచ్చేసిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది.
ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వస్తున్న విమర్శలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ స్పష్టత ఇచ్చారు. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించడం ద్వారా వారు పూర్తి స్దాయిలో బోధనపై దృష్టిపెట్టేందుకు అవకాశం దక్కుతుందన్నారు. అలాగే టీచర్లు కోరిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బోధన మినహా ఇతర కార్యక్రమాలు తమకు అప్పగించొద్దని టీచర్లు కోరారని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
టీడీపీ నేత నారా లోకేష్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించినట్లు చేస్తున్న ఆరోపణలపై బొత్స స్పందించారు. ఆయన్ను వచ్చి టీచర్లను అడగమని సూచించారు. టీచర్ల వినతిని దృష్టిలో ఉంచుకునే ఈ వెసులుబాటు కల్పించామన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తాము చెప్పిందే చేస్తామన్నారు.