ఓడిపోయాం, మమ్మల్ని పిలుస్తారా: బీజేపీలోకి వెళ్తారనే వార్తపై బొత్స
హైదరాబాద్: ఎన్నికలలో ఓడిపోయిన తమను భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆహ్వానిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు బీజేపీలో చేరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని విలేకరులు ప్రశ్నించారు.
వారి వ్యాఖ్యల పైన బొత్స వెంటనే స్పందించారు. ఓడిపోయిన తమను ఎందుకు ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. కమలం పార్టీ నేతలు ఎవరు కూడా తమను సంప్రదించలేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో పంట పొలాలను ధ్వంసం చేయడం సంఘ విద్రోహ చర్య అన్నారు. ఈ దుశ్చర్యకు బాధ్యులు ఎవరనే విషయం బయట పెట్టాలన్నారు. లేదంటే ఈ దురాగతానికి పాల్పడింది ప్రభుత్వమే అని భావించవలసి ఉంటుందని చెప్పారు.
బీజేపీ, టీడీపీపై రఘువీరా నిప్పులు
భారత జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు గుడి కట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి వేరుగా అన్నారు. అయితే ఆ శక్తుల ప్రయత్నాన్ని టీడీపీ, బీజేపీ వ్యతిరేకించడం లేదని విమర్శించారు.
అంతేకాకుండా నాథూరాం గాడ్సే దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను చంపి ఉండాల్సిందని, ఆయన పొరపాటు చేశారని కూడా బీజేపీ నేతలు చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ, బీజేపీల్లో ఉన్న వారు గాడ్సే వారసులు అని ఆయన ధ్వజమెత్తారు.
దేశాన్ని ముస్లీం, క్రిస్టియన్ రహిత భారత దేశంగా మార్చాలని బీజేపీ చూస్తోందన్నారు. రాజధాని నిర్మాణం చేస్తున్న గ్రామాల్లో ధ్వంసం సరికాదన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులకు రక్షణ కల్పించాలన్నారు.