జన్మభూమి ఓ మోసపూరిత కార్యక్రమం: చంద్రబాబుపై బొత్స మండిపాటు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన ఓ ఫార్సుగా మారిందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. పార్టీ నేతలు పార్థసారథి, మర్రి రాజశేఖర్లతో కలసి ఆయన మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జన్మభూమి ఓ మోసపూరిత కార్యక్రమమని ఆయన ధ్వజమెత్తారు. మూడో విడత జన్మభూమి కార్యక్రమం ప్రకటించినపుడు సీఎం చంద్రబాబుకు సంబంధించిన వెబ్సైట్ ‘కోర్ డాష్ బోర్డ్'లో మొదటి, రెండో విడత జన్మభూమి కార్యక్రమాల్లో 28 లక్షల 50 వేల పైచిలుకు పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లుగా చూపించారన్నారు.
ఎప్పుడైతే మూడో విడత జన్మభూమి కార్యక్రమం ప్రారంభించారో లేదో తొలి రోజునే ఆ దరఖాస్తులన్నీ పరిష్కరించినట్లు ఆ వెబ్సైట్లో పేర్కొన్నారని చెప్పారు. ఈ విషయం తెలియని కొన్ని పత్రికలు 95 శాతం దరఖాస్తులు పరిష్కారమైనట్లు రాసేశాయన్నారు.
అంత తక్కువ సమయంలోనే ఈ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యాయా! ఇలా జిమ్మిక్కులు చేస్తారా? ఇంత మోసమా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలు చెబుతున్న తెలుగుదేశం పార్టీ నేతలను జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు నిలదీయాలన్నారు.
గత జన్మభూమి కార్యక్రమాల్లో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయో అడగాలన్నారు. మరోవైపు ఇస్తు తవ్వకాల్లో కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 2వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని సాక్షాత్తూ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారన్నారు.
ఇసుక వ్వవహారంలో సీఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు నారా లోకేశ్కు మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని బొత్స ఆరోపించారు. ఇసుక అక్రమదారులను నడివీధిలో నిలబెట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ మరో వైపు పేద విద్యార్థులు రాజధాని నిర్మాణానికి విరాళాలివ్వాలంటూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.