పొలిటికల్ సునామీ సృష్టిస్తోన్న 'స్కంద'
దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన స్కంద చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. బోయపాటి సినిమాల్లో పొలిటికల్ టచ్, పొలిటికల్ డైలాగ్స్ కొత్త కాదు. ఆయన ప్రతి సినిమాలో కొన్ని సన్నివేశాలు, కొన్ని డైలాగులు ఉంటాయి. అయితే స్కందలో వాటి డోస్ పెరిగింది. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు, సంభాషణలు కొందరు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని రూపొందించినట్లు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు సినీ పరిశ్రమలో కూడా ఇవి హాట్ టాపిక్ గా మారాయి. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులు వాటిగురించే చర్చించుకుంటున్నారు.
సత్యం రామలింగరాజు : శ్రీకాంత్ పోషించిన వ్యాపార దిగ్గజం రామకృష్ణరాజు పాత్ర సత్యం రామలింగరాజుని గుర్తు చేస్తుందంటున్నారు. కొందరు రాజకీయ నాయకుల స్వార్థం వల్లే అంతటి గొప్ప వ్యక్తి జైలు పాలైనట్లుగా చూపించారు. సినిమా ప్రారంభంలో.. పెళ్ళి పీటల మీద నుంచి సీఎం కూతురు వెళ్లిపోతుంది. సీఎం కుటుంబం పరువు కోసం తన సొంత మామను చంపి, గుండెపోటు అని నమ్మించి.. పెళ్ళి ఆగిపోయిందని చెప్పి, వచ్చిన అతిథులను వెనక్కి పంపించేస్తాడు. ఈ సన్నివేశం ఏపీలో గత ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటనను గుర్తుచేస్తుందంటున్నారు.

రాజకీయ వ్యూహకర్త : ఒక సీన్ లో కామెడియన్ రచ్చ రవి చెప్పిన డైలాగ్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. అరాచకాలు సృష్టించి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసే ఒక రాజకీయ వ్యూహకర్తను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ నాయకుడిని గుర్తుచేస్తుంది అంటున్నారు. "మంచిగా ఉన్న నీళ్లలో బురద వేస్తాం.. మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తాం.. గొప్ప నాయకుడిని చెడ్డవాడిగా, చెడ్డ వాడిని గొప్ప నాయకుడిగా చిత్రీకరిస్తాం.. ఉచితాలు పేరుతో మోసం చేస్తాం.. ముందు కొంచెం గడ్డి వేసి, వెనక మొత్తం పాలు పిండుకుంటాం." అంటూ రచ్చ రవి చెప్పిన డైలాగ్ రాజకీయ సంచలనం సృష్టించేలా ఉందంటున్నారు. పృథ్వీరాజ్ పోషించిన రాజకీయ వ్యూహకర్త పాత్ర నిజ జీవితంలోని ఒక ప్రముఖ వ్యూహకర్తను గుర్తు చేసేలా ఉందని చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications