బ్రదర్ అనిల్కు కోర్టులో ఊరట: స్వేచ్ఛ జీవితాన్ని కోల్పోయానని శ్రీలక్ష్మి ఆవేదన
హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్కు హైకోర్టులో ఊరట లభించింది. విచారణ నిమిత్తం ఫిబ్రవరి 26వ తేదీని తమ ఎదుట హాజరుకావాలని ఖమ్మం రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జారీచేసిన సమన్లపై నాలుగు వారాల స్టే విధిస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
2009 ఎన్నికల సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్ స్థానిక చర్చిలో ఎన్నికల ప్రచారం చేశారన్న ఎన్నికల అధికారి ఫిర్యాదుతో ఆయనపై కేసుతోపాటు ఛార్జీషీట్ను పోలీసులు దాఖలు చేశారు. దిగువ కోర్టు సమన్లను సవాల్ చేస్తూ అనిల్ కుమార్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దిగువ కోర్టు సమన్లపై నాలుగువారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
స్వేచ్ఛ జీవితాన్ని కోల్పోయానని శ్రీలక్ష్మి ఆవేదన
ఓబుళాపురం మైనింగ్ కేసు (ఓఎంసీ)లో తనపై సిబిఐ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ అధికారులు ఏకపక్షంగా నమోదు చేసిన కేసుతో స్వేచ్ఛతోపాటు జీవితాన్ని కోల్పోయానని పేర్కొన్నారు. అందుకు తనకు పరిహారం కూడా చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలని పిటిషన్ దాఖలుచేశారు.
ఈ కేసులో తాను 9 నెలలపాటు జైల్లో ఉన్నానని, దీంతో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, సరైన వైద్యం లభించక అనారోగ్యానికి గురయ్యానని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే అధికారిగా ఉత్తర్వులపై సంతకాలు చేసినట్లు శ్రీలక్ష్మి తెలిపారు.
తనను అరెస్ట్ చేయడంతో సస్పెన్షన్కు గురయ్యానని, ఇప్పటివరకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదని వివరించారు. ఈ కేసువల్ల సర్వీస్ ప్రయోజనాలు కూడా పూర్తిగా అందుకోలేకపోతున్నట్లు శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.