స్వార్ధం కోసమే - ఆధారపడొద్దు: ప్రభుత్వ పథకాలపై బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు..!!
బ్రదర్ అనిల్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండునని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని అనిల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పైన వ్యాఖ్యానించారు. తమ స్వార్ధం కోసం ప్రభుత్వమిచ్చే పథకాలపై ప్రజలు ఆధారపడొద్దని సీఎం జగన్ బావ.. పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. విశాఖ జిల్లా భీమిలి మండలంలో క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్ లో నిర్వహించిన ప్రార్ధన కూడికలో పాల్గొన్న బ్రదర్ అనిల్ ఈ వ్యాఖ్యలు చేసారు.

పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండనే భావన
దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. బ్రదర్ అనిల్ ఈ వ్యాఖ్యల సమయంలో ఎక్కడా ముఖ్యమంత్రి..పార్టీ పేరు ప్రస్తావించలేదు. కానీ, ప్రభుత్వం..ప్రభుత్వాలు అంటూ తన దైవ వాక్యం మధ్యమధ్యలో పరోక్షంగా విమర్శలు చేసారు. గతంలోనూ విశాఖ - విజయవాడ పర్యటనల సమయంలో ఏపీ రాజకీయాలపైన బ్రదర్ అనిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. అన్న జగన్ తో సోదరి షర్మిల విభేదించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు తరువాత బ్రదర్ అనిల్ ఏపీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలతో
ఒక దశలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలతో ఏపీ కేంద్రంగా సమావేశమైన బ్రదర్ అనిల్ కొత్త పార్టీ దిశగా చర్చలు చేసారు. వారంతా ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతుగా నిలిచారని..ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు దిశాగా ఆలోచన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వారు పార్టీ ఏర్పాటు చేస్తే తాను మద్దతు ఇస్తానని అప్పట్లోనే బ్రదర్ అనిల్ స్పష్టం చేసారు. తరువాత బ్రదర్ అనిల్ పార్టీ ఏర్పాటు ఖాయమని ప్రచారం సాగింది. కానీ, అనిల్ తాను పార్టీ ఏర్పాటు చేయటం లేదని స్పష్టత ఇచ్చారు. ఆ తరువాత రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లిలో బ్రదర్ అనిల్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ భేటీ తరువాత రాజకీయ పరిస్థితుల పైన చర్చించామని చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయంటూ ఆసక్తి పెంచారు.

షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుతో
రాజకీయంగా షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు పైన సీఎం జగన్ విభేదించారు. పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం తమ విధానం కాదని సీఎం జగన్ స్పష్టతతో ఉన్నారని వైసీపీ ముఖ్య నేత సజ్జల స్పష్టం చేసారు. ఆ తరువాత సీఎం జగన్ - షర్మిల తమ తండ్రి వైఎస్సార్ జయంతి - వర్దంతి సమయాల్లోనే ఇడుపుల పాయలో ఒకే వేదిక మీదకు వస్తున్నారు. షర్మిల కేంద్రంగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వైఎస్ విజయమ్మ సైతం వైసీపీ ప్లీనరీ వేదికగా పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవిలో కొనసాగలేనని.. కుమార్తె షర్మిలకు మద్దతుగా నిలవాల్సి ఉందని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు బ్రదర్ అనిల్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications