ఉప్మా పెట్టి ఆదరించిన వదినను నగల కోసం హత్య చేశాడు
తిరుపతి: తల్లిలాంటి వదినపై ఓ కిరాతకుడు అత్యంత దారుణంగా వ్యవహరించి ఆమెను హత్య చేశాడు. అప్పడాల కర్రతో మోది, బ్లేడుతో కోసి ప్రాణం తీశాడు. మూడు రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హతురాలి మరిదే నిందితుడని పోలీసులు కనిపెట్టారు. అతను తన వదినను హత్య చేసిన తీరును చూసి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. తిరుపతి ఏఎస్పీ త్రిమూర్తులు ఆ సంఘటన వివరాలను అందించారు.
ఈ నెల 19న తిరుపతి ఎస్వీయులో ఏఏఓగా పని చేస్తున్న శివశంకర్ భార్య హత్యకు గురైంది. అప్పటి నుంచి పోలీసులు బంధువులపై అనుమానంతో నిఘా పెట్టారు. శివశంకర్ చిన్న తమ్ముడు మురళిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు వెలుగు చూశాయి. శివశంకర్కు నలుగురు అన్నదమ్ములున్నారు. వారిలో చిన్నవాడు మురళి. అన్నదమ్ముల నడుమ ఆస్తి తగాదాలున్నాయి.
తాగుడుకు అలవాటు పడ్డ మురళి ఎప్పుడు డబ్బుకోసం తిరుగుతుండేవాడు. అలాగే 19 ఉదయం 10.30 గంటల సమయంలో శివశంకర్ ఇంటికి చేరుకున్నాడు. రాక రాక మరిది వచ్చాడని శివశంకర్ భార్య సుధారాణి ఉప్మా చేసి పెట్టింది. ఇంట్లో కూర్చుని తిన్న మురళి. తన ఆస్తి విషయమై అన్న నచ్చజెప్పాలని వదినను కోరాడు. అందుకు సుధారాణి మాట్లాడుతానని హామీ ఇచ్చింది. కానీ తనకు ప్రస్తుతం రెండు వేల రూపాయల డబ్బులు కావాలని కోరాడు. అయితే అతని వాలకం తెలిసిన సుధా తన వద్ద లేవని చెప్పింది. అప్పటికే తన వదిన ఒంటి మీద ఉన్న బంగారుపై మురళి కన్నేశాడు.
ఇక వదిన ఇల్లంత చూపిస్తుండగా పక్కనే ఉన్న అప్పడాల కర్రను తీసుకున్నాడు. ఇక అదును చూసి వదిన తలపై బలంగా మోదాడు. చావలేదని బ్లేడుతో గొంతు కోశాడు. మెడలోని గొలుసు, కమ్మలు అన్ని వలుచుకుని వెనుక వాకిటి నుంచి పరారయ్యాడు. తరువాత ఏమి ఎరుగని వాడిలా ఏడుస్తూ వచ్చి దహనక్రియలలో పాల్గొన్నాడు. అతని వాలకంపై అనుమానం కలిగిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే తప్పును అంగీకరించాడు.