బీటెక్ స్టూడెంట్స్ గొడవ : కత్తితో మెడపై పొడిచి పరారు
చిత్తూరు : సాయిమోహన్, శశిధర్ రెడ్డి అనే ఇద్దరు బీటెక్ విద్యార్థుల మొదలైన చిన్నపాటి ఘర్షణ.. పెద్ద వివాదానికి దారి తీసింది. మాటా మాటా పెరిగి ఇద్దరు కొట్టుకునేంత వరకు వెళ్లింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన శశిధర్ రెడ్డి సాయిమోహన్ మెడపై కత్తితో పొడిచాడు. అనంతరం శశిధర్ రెడ్డి అక్కడినుంచి పరారవగా ప్రస్తుతం సాయిమోహన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
చిత్తూరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాగా, వీరిద్దరు బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులుగా తెలుస్తోంది. స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీయగా.. సాయిమోహన్ చేతులు వెనక్కి కట్టేసి కత్తితో అతని మెడపై తీవ్రంగా దాడి చేశాడు శశిధర్ రెడ్డి. సాయిమోహన్ అరుపులు విన్న కాలేజీ సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి వున్న సాయిమోహన్ని ఆస్పత్రికి తరలించారు. అటుపై సాయిమోహన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం సాయిమోహన్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్థికపరమైన కారణాలే ఇద్దరి మధ్య గొడవకు దారి తీసి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఇద్దరి స్నేహితుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.