చంద్రబాబు ఇబ్బంది పడితే..తెలుగు జాతికే అవమానం: ఆ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలతో దాడికి..!
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచన ఆరోపణలు చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై దాడికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందు కోసం వైసీపీలోని ముగ్గురు ఎమ్మెల్యేలను దీని కోసమే కేటాయించారని చెప్పుకొచ్చారు. తమ పార్టీ అధినేత చంద్రాబును ఇబ్బంది పెడితే అది తెలుగు జాతిని అవమానించటమేననే విషయం మర్చిపోవద్దనంటూ హెచ్చరించారు. జగన్ పాలనలో ఇప్పటికే అనేక పెట్టుబడులు వెనక్కి పోయాయని బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబును అవమానించటం కోసమే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుపై దాడికి కుట్ర..
టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడికి కుట్ర జరుగుతోందని టీడీపీ మండలి విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. చంద్ర బాబు పైన దాడి కోసమే తమ పార్టీలోని కొందరు సభ్యులను జగన్ రౌడీలుగా తయారు చేసారన్నారు. వారందరినీ టీడీపీ సభ్యుల వైపు కూర్చోపెట్టి ఇబ్బంది పెడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. కోటంరెడ్డి, కారుమురి నాగే శ్వరరావు, బీఏ మధుసూదనరెడ్డి ఈ ముగ్గురు సభ్యులను చంద్రబాబుపై దాడి కోసమే పెట్టారని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుని ఎన్నో అవమానాలకు గురిచేస్తున్నారని బుద్దా వెంకన్న వాపోయారు. అధికారపక్ష సభ్యుల ఏకవచన విమర్శలు, చేసే అవమానాలను చూపించటం లేదని విమర్శించారు.

ఆయన్ను ఇబ్బంది పెడితే తెలుగు జాతిని..
చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం ద్వారా తెలుగుజాతిని అవమానిస్తున్నారని మరచిపోవద్దని బుద్దా వెంకన్న కొత్త బాష్యం తెర మీదకు తెచ్చారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఎంత ముందుకెళ్లిందో.. జగన్ సీఎం అయ్యాక అంత వెనక్కి పోతోందని విమర్శించారు. రాష్ట్రంపై అపనమ్మకంతో ఇప్పటికే ఎన్నో పెట్టుబడులు వెనక్కి పోయాయని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. తాజాగా సభలో చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ సైతం స్పందించారు. గత సభలో చంద్రబాబు నేర్పిన విద్యనే తాము ఇప్పుడు ప్రదర్శిస్తున్నామని చెప్పుకొచ్చారు. గత సభలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబితే..తాను కూడా క్షమాపణ చెప్పటానికి సిద్దమని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications