మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూది హత్యనే?: భర్త సచిన్ అరెస్టు
హైదరాబాద్: మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూ మృతి కేసులో ఆమె భర్త సచిన్ను పోలీసులు అరెస్టు చేశారు. భార్యాభర్తల మధ్య ఆదివారం రాత్రి తీవ్రమైన గొడవ జరిగిందని అంటున్నారు. హైదరాబాదులోని రామంతపూర్ ఇందిరానగర్లోని తమ ఇంట్లో గొడవ సందర్భంగా భర్త సచిన్ ఉప్పల్ తలను నేలకేసి కొట్టడంతో రీతూ సరీన్ (28) మరణించినట్లు చెబుతున్నారు.
హైదరాబాదులోని కోఠీలో ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం చేసే సచిన్ ఆదివారం రాత్రి ఇంటికి రాగానే భార్యతో గొడవ పడ్డాడని సమాచారం. వరకట్నం కోసం సచిన్ భార్యను తరుచుగా వేధిస్తూ ఉండేవాడని, ఆ విషయం గురించే ఆదివారం రాత్రి గొడవ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జంషెడ్పూర్కు చెందిన రీతూ సచిన్ను ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకుంది.
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సోమవారంనాడు సచిన్ను అరెస్టు చేశారు. గొడవ జరిగిన సమయంలో సచిన్ మద్యం సేవించి ఉన్నాడా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.
తలను నేలకేసి కొట్టడంతో రీతూ మరణించినట్లు అనుమానిస్తున్నారు. రీతూ దేహంపై గాయాలు పెద్దగా లేవు. కానీ లోపలి దెబ్బలతో ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ అసలు కారణం తెలియదని అంటున్నారు.
రీతూ పడిపోయిన వెంటనే సచిన్ ఆమె తండ్రికి ఫోన్ చేసి, రీతూ ఆరోగ్యం బాగా లేదని, ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని చెప్పాడని, ఆ వెంటనే తల్లిదండ్రులు వచ్చి రీతూను ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని అంటున్నారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు.
రీతూ తల్లి ఉజాలా సచిన్ను నిలదీయడంతో అతని తల్లి గొడవ పడినట్లు కూడా చెబుతున్నారు. రీతూ కుటుంబ సభ్యులు సచిన్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పెళ్లి అయినప్పటి నుంచీ సచిన్ రీతూను వేధిస్తూనే ఉన్నాడని వారు ఆరోపిస్తున్నారు. రీతూ కుటుంబ సభ్యులు సోమవారంనాడు గాంధీ మార్చురీ వద్ద దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. రీతూకు ఐదు నెలల కుమారుడు ఉన్నాడు.