చలివేంద్రాల్లో మజ్జిగ, తాటిముంజలు: మంత్రితో రిబ్బన్ కటింగ్, చేసేది చీటింగ్
నెల్లూరు: ఎండాకాలం నేపథ్యంలో రోడ్డు పైన మనం చలివేంద్రాలు చూస్తూనే ఉంటాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చలివేంద్రంలో తాటి ముంజలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో టిడిపి అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఓ చలివేంద్రాన్ని ఇటీవల ప్రారంభించారు.
ముంజలు పంపిణీ చేశారు. విపరీతమైన ప్రచారం వచ్చి అక్కడ జనాల వరుస కట్టారు. దీంతో, ఓ కార్పొరేటర్ తన వార్డులో తాటి ముంజలతో పాటు కొబ్బరి బోండాలు, మజ్జిగ అంటూ చలివేంద్రాన్ని ప్రారంభించారు.
దీనిని ఓ మంత్రితో అట్టహాసంగా ప్రారంభింపజేశారు. ఇక్కడకు కూడా జనాలు వరుస కట్టారు. సదరు కార్పోరేటర్ మరోచోట ఫ్రూట్ జ్యూస్, ఐస్క్రీంలను కూడా కలిపి మరో చలివేంద్రాన్ని మరో మంత్రిని పిలిచి ప్రారంభించారట.
ఈ చలివేంద్రానికి బాగానే ప్రచారం లభించింది. ఆ చలివేంద్రాలకు నెల్లూరువాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే, ఈ ధాటి తట్టుకోలేకపోతున్నారు. దీంతో, అక్కడ వాటిని పంపిణీ చేయడం లేదో లేక కొరత వచ్చిందో తెలియదు కానీ.. అక్కడకు ఆ తర్వాత వస్తున్న వారికి మజ్జిగ, ఐస్ క్రీం కనిపించడం లేదంటున్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఉండటం లేదంటున్నారు.