మెదక్ లోకసభ: తెరాసతో దేవీప్రసాద్, వారించిన బాబు
హైదరాబాద్: ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు కాంగ్రెస్, బీజేపీలలో పోటాపోటీ నెలకొంది. అంతేకాకుండా బీజేపీ పోటీలో లేకుంటే టీటీడీపీ పోటీ చేయాలని భావిస్తోంది.
అవసరమైతే బీజేపీని పక్కన పెట్టి పోటీ చేయాలని టీటీడీపీ ఆలోచిస్తోంది. ఇప్పటికే ఇక్కడ పోటీకి సంబంధించి ఆయా పార్టీల్లో అభ్యర్థుల మధ్య పోటా పోటీ నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. సెప్టెంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. ఉప ఎన్నికల్లో రాజకీయంగా అమీతుమీ తేల్చుకోవటానికి పార్టీలన్నీ సిద్ధపడుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలుపొందాలని టీఆర్ఎస్ భావిస్తుంటే.. అధికారం చేపట్టి మూడు నెలలు కూడా కాకపోయినా ప్రభుత్వ వైఫల్యాలే తమ అస్త్రాలుగా విపక్షాలు భావిస్తున్నాయి. ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన తీరు మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో తమకు ప్లస్ పాయింట్ అని అంచనా వేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి
మెదక్ ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ టికెట్కు ఎక్కువ పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ఉప ఎన్నికల్లో తెరాస టిక్కెట్ ఆశిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తామని అధిష్ఠానం చెప్పటం వల్లనే, అప్పుడు దుబ్బాక అసెంబ్లీ రేసు నుంచి ప్రభాకర్ రెడ్డి వైదొలగినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే స్వామిగౌడ్ ఎమ్మెల్సీగా, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి
అలాగే సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు కూడా టీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నారు. మెదక్ జిల్లా స్వస్థలమైనా.. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడ్డ ప్రవీణ్ రెడ్డి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన శనివారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిశారు. తొలి నుంచి టీఆర్ఎస్కు ఆర్థికంగా అండదండలు అందించటమేకాక, పార్టీ అధిష్ఠానం ముఖ్యులకు సన్నిహితంగా ఉండే ప్రవీణ్ రెడ్డికే మెదక్ టికెట్ లభిస్తుందనే విశ్వాసాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్
కాంగ్రెస్ నుంచి పాత అభ్యర్థి శ్రవణ్ కుమార్ రెడ్డి రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. అయితే మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ విప్ జగ్గారెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇస్తే పార్టీలో చేరడానికి కొంతమంది ఇతర పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
టీడీపీ, బీజేపీ
మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్కు పోటీ తీవ్రమైంది. అదే సమయంలో మెదక్ ఉప ఎన్నికపై టీడీపీ కూడా కన్నేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్.. కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. పొత్తు ధర్మంలో భాగంగా ఉప ఎన్నికల్లోనూ అక్కడ బీజేపీకి మద్దతు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. అయితే, ఉప ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగాలని తెలంగాణ టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు భావిస్తున్నారు.
టీడీపీ, బీజేపీ
పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో శనివారం జరిగిన సమావేశంలో వారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మెదక్లో సొంతంగా అక్కడ టీడీపీకి ఉన్న బలమే అధికమని, టీడీపీ పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని వివరించారట. కానీ, చంద్రబాబు వారిని వారించారట. పొత్తు ధర్మం ప్రకారం ఆ సీటును బీజేపీకే ఇవ్వాలని, దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలని సూచించారట.
టీడీపీ, బీజేపీ
టీడీపీతో పొత్తు లేకుండా తాము సొంతంగా పోటీ చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటన చేశారని టీవీల్లో వస్తోందని, వాళ్లు అలాంటి మాటలు మాట్లాడితే మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలని ఒకరిద్దరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారట. అయితే, వారు ఏం మాట్లాడారన్నది మనకు ముఖ్యం కాదని, అవన్నీ తాను చూసుకొంటానని, మీరెవరూ తొందరపడి మాట్లాడవద్దని, బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయవద్దని సూచించారు.
టీడీపీ, బీజేపీ
ఒకవేళ కమలనాథులు పోటీ చేయకపోతే, తాము బరిలో దిగాలనే ఉద్దేశంతో టీడీపీ ఉంది. ఈ క్రమంలో నరేంద్రనాథ్ తిరిగి బీజేపీ టికెట్ ఆశిస్తుండగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బరిలోకి దిగుతారనే ప్రచారం ఉంది. పార్టీ నేతలు సంగారెడ్డి సత్యనారాయణ, రఘునందన్ రావు, కాంగ్రెస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చివరి నిమిషంలో బీజేపీలో చేరితే, ఆయన కూడా టికెట్ ఆశించవచ్చంటున్నారు.