రాజధాని రగడ: మూడు పార్టీలకు బైరెడ్డి హెచ్చరిక
రాష్ట్రం విడిపోతే అత్యధికంగా నష్టపోయేది రాయలసీమేనన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని రాయలసీమ కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రంలోనూ అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం ప్రజలకు లేదన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే కర్నూలును రాజధానిగా చేయడం ఒక్కటే మార్గమన్నారు.
కర్నూలును రాజధానిగా చేయడం అన్నది కొత్తగా వచ్చిన డిమాండ్ కాదన్నారు. గతంలో ఉన్న రాజధానిని త్యాగం చేసిన రాయలసీమ వాసులు ఆ తరువాత అడుగడుగునా మోసానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మోసపోవడం సాధ్యం కాదని రాయలసీమ హక్కుల కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మరో కొత్త మోసంతో నాయకులు ముందుకు పోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే భారీ స్థాయిలో చెలరేగుతుందని హెచ్చరించారు.