హోదా: బాబుపై బాంబు పేల్చిన రామచంద్రయ్య, ఏపీ సీఎంకు 'కెసిఆర్' చిక్కు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య సోమవారం నాడు బాంబు పేల్చారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుకు ముందే తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రాజ్యసభలో ప్రత్యేక హోదా పైన ప్రయివేటు బిల్లు పెడితే స్పష్టత వచ్చిందని మండిపడ్డారు. 30 సార్లు ఢిల్లీకి వెళ్లానని చంద్రబాబు చెబుతున్నారని, అన్నిసార్లు వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. ఏపీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ కడుతున్న పాలమూరు ప్రాజెక్టు పైన చంద్రబాబు తెలంగాణ సీఎం కెసీఆర్ను నిలదీయడం లేదని ఆరోపించారు. అంతకుముందు, జగన్ కూడా ఓటుకు నోటు కేసు భయంతో చంద్రబాబు పాలమూరు ప్రాజెక్టుల పైన ప్రశ్నించడం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో చంద్రబాబును విపక్షాలు ఇరుకునపడే ప్రయత్నాలు చేస్తున్నాయి.
చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెరిగిపోతున్న మతతత్వశక్తుల అణచివేతకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసిపోయి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే కమ్యూనిస్టులు తమతో కలిసిపోవాలని సూచించారు.
తిరుపతిలో జరిగిన సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ శత జయంతి సభకు హాజరైన చింతామోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు విన్న కమ్యూనిస్టులు ముక్కున వేలేసుకున్నారు.