పక్కా ప్లాన్తో టి: చివరిదాకా గోప్యతపై కావూరి నిలదీత!
అంతేకాకుండా కేబినెట్ మంత్రులకు నోట్ పంపిణీ చేసినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ ఎవరికి పంపిణీ చేయలేదని సమాచారం. కేబినెట్ సమావేశం మరో గంటలో ఉందనగా మాత్రమే స్పష్టత వచ్చింది. సుశీల్ కుమార్ షిండే చివరి దాకా అంతులేని గోప్యత పాటించారు. సాయంత్రం 5.30 గంటలకు కేబినెట్ సమావేశం మొదలుకానుండగా అంతకు రెండుమూడు గంటలముందు షిండే మీడియాతో మాట్లాడారు.
మధ్యాహ్నం రెండు గంటల వరకు నోట్పై తాను సంతకం పెట్టలేదని, తెలంగాణపై నోట్ను తాము ఎప్పుడో తయారు చేశామని అయితే, దానికి సంబంధించి తనకు సూచనలు రాలేదని, తాను ఇంత వరకూ నోట్పై సంతకం కూడా చేయలేదన్నారు. కానీ మీడియా మాత్రం అది మంత్రులకు పంపిణీ అయ్యిందని, అదనీ ఇదనీ ఏదేదో ప్రచారం చేస్తోందని షిండే అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నారా? అని ప్రశ్నించగా.. ఇంకా తాను సంతకమే చేయలేదని, సంతకం చేస్తే ఇవన్నీ నిర్ధారణ అవుతాయన్నారు.
అనంతరం షిండే తన కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో నోట్ కేబినెట్కు వస్తోందంటూ ప్రసారమవుతున్న వార్తల గురించి విలేకరులు ప్రస్తావించగా.. అవన్నీ ఊహాగానాలే అని షిండే కొట్టిపారేశారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయనే మీడియా ముందుకు వచ్చి నోట్ను మంత్రివర్గం ఆమోదించిన సంగతి చెప్పారు. కేబినెట్ సమావేశానికి కొద్దిముందు ఆయన సంతకం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
కేబినెట్ నోట్ అంశం రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర కేంద్ర మంత్రులకు కూడా తెలియదని తెలిస్తోంది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. లేని అంశాన్ని టేబుల్ అంశంగా ఎలా తీసుకు వచ్చారని, తమకు ఇది అంగీకారంకాదని కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, పల్లం రాజులు భేటీలో చెప్పినప్పటికీ వారి వాదనను ఎవ్వరూ లక్ష్యపెట్టలేదట.