సీఎం జగన్ కు ఢిల్లీ కాల్-రాజీ ఫార్ములా : రఘురామ ఇష్యూ-టీడీపీ వెయిటింగ్..!!
పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ సడన్ గా తమ వ్యూహం మార్చేసింది. వైసీపీ ఎంపీల తీరు ఇతర పార్టీలకు అంతు చిక్కటం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజ్యసభలో...అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం తీసుకొనే ప్రతీ నిర్ణయానికి వైసీపీ మద్దతిస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆకస్మికంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తోంది.ఉభయ సభల్లో ప్రతిపక్షాల సభ్యులకు ధీటుగా ఏపీ అంశాల పైన ప్లకార్డులు ప్రదర్శిస్తూ..నినాదాలు చేస్తున్నారు.
Recommended Video
వైసీపీ సడన్ వ్యూహం..ఏం జరుగుతోంది..
దీంతో..కేంద్ర పెద్దలు వైసీపీ ముఖ్య నేతతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. తాము చాలాకాలం సహనంతో ఉన్నామని..ఏదైనా పార్టీ అధినేత-సీఎం జగన్ తో చర్చించాలని..తమ చేతుల్లో ఏమీ లేదంటూ ఆ ముఖ్య నేత స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు నేరుగా సీఎం జగన్ తోనే మాట్లాడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా ఎన్డీఏకు దూరం అవుతున్నాయి. వైసీపీ ఎన్డీఏ లో భాగస్వామిగా లేకపోయినా.. రాజ్యసభలో వైసీపికి ఉన్న ఆరుగురు సభ్యులు మద్దతు..త్వరలో పెరిగే మరో నలుగురి సభ్యుల సంఖ్య బీజేపీకి చాలా కీలకం. పలు ముఖ్యమైన బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్దం అవుతోంది.
జగన్ తోనే నేరుగా చర్చలు..రాజీ ఫార్ములా
ఈ సమయంలో వైసీపీ తో మైత్రి వదులుకోవటానికి బీజేపీ సిద్దంగా లేదు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 26 లేదా 27వ తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాము ఇంత కాలం కేంద్రానికి ఎంతగా సహకరించినా... కేంద్రం నుంచి మాత్రం ఆ స్థాయిలో తమకు సహకారం అందటం లేదనేది వైసీపీ వాదన.
ప్రత్యేక హోదా అంశంలో ఇబ్బందులు ఉన్నా..తాము కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో ఒక ఎంపీ తమను జాతీయ స్థాయిలో ఉద్దేశ పూర్వకంగా డామేజ్ చేస్తుంటే...ఆ ఎంపీ పైన చర్యలు పదే పదే డిమాండ్ చేసినా పట్టించుకోక పోవటాన్ని వైసీపీ ముఖ్య నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
రఘురామ అంశంలో ఉద్దేశ పూర్వకమనే సందేహం..
ఆ ఎంపీ టీడీపీ నేతలతో కలిసి తమకు వ్యతిరేకంగా చేస్తున్నారనే ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవటం వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇక, ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చిన సమయంలోనూ ఏపీకి సంబంధించిన పలు అంశాలను గతం కంటే భిన్నంగా..గట్టిగా ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్నారనేది విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో ఢిల్లీ పరిణామాలను టీడీపీ అధినాయకత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. 2019 ఎన్నికల ఫలితాల సమయం నుండి బీజేపీతో తిరిగి జత కట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.
కాచుకొని కూర్చున్న టీడీపీ..జగన్ అడుగులు
ఢిల్లీ కేంద్రంగా ఈ మధ్య కాలంలో అవి మరింత ముమ్మరమయినట్లు సమాచారం. అయితే, బీజేపీ అధినేతలు మాత్రం ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసేందుకు సుముఖంగా లేరు. సీఎం జగన్ వీటన్నింటినీ పరిశీలిస్తూనే..తన వ్యూహం అమలు చేస్తున్నారు. టీడీపీ-బీజేపీ మరోసారి కలిసినా తమకు నష్టం లేదనే అభిప్రాయం వైసీపీలో ఉంది. దీంతో..హస్తినలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగానే జగన్ సైతం పావులు కదుపుతున్నారు. అయితే, ఈ సారి జగన్ ఢిల్లీ పర్యటన ద్వారా వైసీపీ - బీజేపీ మధ్య అనధికార మైత్రి..భవిష్యత్ సంబంధాలు..అదే విధంగా వైసీపీ చేస్తున్న రాష్ట్ర-రాజకీయ అంశాల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.