నకిలీ డాక్యుమెంట్లు: కాల్మనీ కేసులో నిందితుడు సత్యానందం మళ్లీ అరెస్ట్
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ కేసులో నిందితుడిగా ఉన్న సత్యానందాన్ని మరో కేసులో ఏపీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సమాచార హక్కు చట్టం కేసులో నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చినందుకు గాను అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, సత్యానందంకు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించింది. కాల్మనీ, సెక్స్ రాకెట్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారు. కాల్మనీ కేసులో ఇటీవలే ఆయనకు ఉమ్మడి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సత్యానందకు హైకోర్టు బెయిల్ మంజారు చేయడంపై ఏపీ డీజీపీ జేవీ రాముడు గతంలో మాట్లాడుతూ కాల్మనీ, సెక్స్ రాకెట్ కేసుకి సంబంధించి ఒక్క కేసులో మాత్రమే ఆయన బెయిల్ పొందాడని చెప్పారు. అతనిపై ఇంకా మరికొన్ని కేసులు పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు.
కాల్మనీ, సెక్స్ రాకెట్ కేసులో విచారణ కోసం డీఈ సత్యానందంను అదుపులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు సత్యానందంకు మంజూరైన బెయిల్ రద్దు కోరుతూ అప్పీలుకు వెళ్లామని నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ సైతం వెల్లడించారు.
కాగా, కోర్టు ఆదేశాలతో బెయిల్పై బయటకు వచ్చిన సత్యానందాన్ని కొన్ని గంటల్లోనే నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్కు తరలించారు. మూలపాడుకు చెందిన కోటా సాంబశివరావు అనే రైస్ మిల్లు యాజమాని వద్ద 2007లో ఐదు లక్షలు తీసుకున్న సత్యానందం తిరిగి ఇవ్వకుండా మోసం ఫిర్యాదు అందింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేసి రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు. స్టేషన్ నుంచి శుక్రవారం సాయంత్రం నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇన్ఛార్జి కోర్టులో హాజరుపరిచారు.