రాజధాని జిల్లాకు ఎన్టీఆర్ పేరు: కేఈ, అమరావతి భేష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరు పెట్టనున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో... ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. రాజధాని జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నారు. ఏపీ రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా మార్చి దానికి ఎన్టీఆర్ పేరు పెట్టి, రాజధానికి అమరావతి పేరు పెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధానికే ఎన్టీఆర్ పేరు పెట్టాలనేది తన ఉద్దేశం కాదని, రాష్ట్రంలో ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైయస్సార్ జిల్లాలు ఉన్నట్లుగానే రాజధాని జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
లండన్, ఏథెన్స్ తదితర నదీముఖంగా ఉన్న రాజధానులు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయని, ఏపీ రాజధాని అద్భుతంగా ఉంటుందన్నారు. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ.. రాజధానికి ఎన్టీఆర్ పేరు బాగుండదని, జిల్లాకు అయితే బాగుంటుందని, రాజధానికి అమరావతి పేరు బాగుంటుందన్నారు.
కాగా, అమరావతి పేరు బాగుందని మండలి బుద్ధ ప్రసాద్ కూడా చెప్పారు. తెలుగుజాతి చరిత్రలో అమరావతి ప్రాంతం, ఆ పేరు ముడిపడి ఉందని బుద్ద ప్రసాద్ అన్నారు. ఏపీ రాజధానికి అమరావతి పేరును ఖరారు చేయడమే అన్ని విధాలా బాగుంటుందన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఆమరావతి పేరును స్వాగతించారు.