పంటకాల్వలోకి దూసుకెళ్లిన కారు:నలుగురు అక్కడిక్కడే మృతి
సడెన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ పంట కాల్వలోకి దూసుకుపోయింది.
ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో అదుపు తప్పిన ఓ కారు పంట కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.
ప్రమాద సమయంలో కారు మండపేట నుంచి రాజోలు వైపుగా వెళ్తోంది. ప్రధాన రహదారి పక్కనే పంట కాల్వ ఉండటంతో ఇక్కడ తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. గన్నవరం మీదుగా వెళ్తున్న క్రమంలో కారు డ్రైవ్ చేస్తున్న గోపాల కృష్ష సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది.
సడెన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ పంట కాల్వలోకి దూసుకుపోయింది. పంట కాల్వలో నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉండటంతో దాదాపు అర కి.మీ వరకు కారు నీళ్లలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
మృతులంతా మండపేట వాసులని గుర్తించారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని గోపాల కృష్షగా గుర్తించగా.. మిగతా ముగ్గురు అతని తల్లి ఇద్దరు చెల్లెళ్లుగా గుర్తించారు. కారులో వారు ఎక్కడికి బయలుదేరారనే విషయంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా, గన్నవరం-రాజోలు ప్రధాన రహదారి వెంబడి దాదాపు 20కి.మీ ప్రధాన పంట కాల్వ ఉన్నప్పటికీ.. ఇంతవరకు ఎక్కడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.