పోసాని కృష్ణ మురళీ పై కేసు నమోదు - కోర్టు ఆదేశాలతో..!!
ప్రముఖ సినీ నటుడు.. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన వీర మహిళ యం దం ఇందిర గతంలో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు పట్టించుకోకపోవడం, అలాగే కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
కోర్టులో వాదనలు పూర్తయిన తరువాత పోసానిపై కేసులు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై 355, 500, 504,506,507, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ పవన్ కల్యాణ్ పైన పోసాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. అప్పట్లో ఆ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యంలో చేరిన పోసాని..ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసారు. వైసీపీ ప్రారంభం అయిన తరువాత పోసాని..జగన్ కు దగ్గరయ్యారు. జగన్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు.
2019 ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం పోసానికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాను సీఎం జగన్ కట్టబెట్టారు. గతంలో ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం వివాదాస్పదమైన సమయంలో మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ త పలు మార్లు చర్చలు చేసారు. ఇదే అంశానికి సంభందించి చిరంజీవితో పాటుగా హీరోలు ..సినీ ప్రముఖులతో జరిగిన సమావేశానికి పోసానికి ఆహ్వానం అందింది.
ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టికెట్ల వ్యవహారానికి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో వివాదం ముగిసింది. ఇక, జనసేన వర్సస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో రాజకీయం మారింది. ఇప్పుడు తాజాగా పోసాని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులవ్వటం.. ఈ సమయంలో కేసు నమోదు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.