రేవంత్ నోటుకు ఓటు: చంద్రబాబు పాత్రపై మూడు వాదనలు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు తగ్గుముఖం పట్టాయి. కానీ రాజకీయాలు వేడెక్కాయి. నోటుకు ఓటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు రాజకీయాలను వేడెక్కించాయి. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రపై మూడు వాదనలను తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు వినిపిస్తున్నారు.
నోటుకు ఓటు కేసును వారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుట్రగా అభివర్ణిస్తున్నారు. రేవంత్ రెడ్డి తప్పు చేయలేదని గానీ, స్టీఫెన్ సన్తో చంద్రబాబు మాట్లాడలేదని వారు కచ్చితంగా చెప్పడం లేదు. లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ వంటివారు కూడా ముందుకు వచ్చి చంద్రబాబు స్టీఫెన్సన్తో మాట్లాడిన సంభాషణల టేప్ గురించి ప్రశ్నిస్తున్నారు. ఆ గొంతు తనది కాదని చంద్రబాబు చెప్పగలరా అని అడుగుతున్నారు.
వాటికి వేటికీ సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఫోన్లను ట్యాప్ చేశారని, ట్యాపింగ్ వల్ల ప్రభుత్వాలే కూలిపోయాయని తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలాంటివి చేస్తున్నారు. ఇది వారు చేసే ఒక వాదన. మరి రెండో వాదను - చంద్రబాబు ఎక్కడెక్కకడో మాట్లాడిన మాటలను గుదిగుచ్చి పేర్చి టాంపరింగ్ చేశారని మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని వారు గట్టిగా చెప్పలేకపోతున్నారు. కానీ దాన్ని కూడా ప్రచారంలో పెట్టారు.
తాజాగా పెట్టిన వాదన - చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడానికి లేదా అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి చట్టపరమైన పరిధి (జ్యురిడిక్షన్) లేదనేది. ఇది మూడో వాదనగా ముందుకు వచ్చింది. ఇవన్నీ కేసులో నిలబడుతాయా అనేది ప్రశ్న.
చివరగా, చంద్రబాబు కెసిఆర్కు హెచ్చరికలాంటి బెదిరింపు చేశారు. తనను అరెస్టు చేస్తే కెసిఆర్ ప్రభుత్వం అదే రోజు కూలిపోతుందని ఓ జాతీయ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. రేపో మాపో లేదంటే, ఢిల్లీ నుంచి వచ్చి తర్వాతనో చంద్రబాబుకు నోటుకు ఓటు కేసులో ఎసిబి నోటీసులు జారీ చేస్తుందనే ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. పార్టీల ఫిరాయింపులు దండిగా జరుగుతున్న మాట వాస్తవమే. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టిఆర్ఎస్లోకి వెళ్లి పదవులు కూడా పొందారు. దానిపై తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్సలు ఎక్కుపెట్టారు. ఈ ఫిరాయింపుల్లో డబ్బులు చేతులు మారాయా అనేదాన్ని రుజువు చేయగలరా అనేది ప్రశ్న. అలా రుజువు చేయగలిగితే కెసిఆర్ పూర్తిగా చిక్కుల్లో పడుతారు. ఏమైనా, చట్టపరమైన విషయాన్ని రాజకీయం చేస్తున్నారనేది న్యాయనిపుణులు చెబుతున్న మాట.