నోటుకు ఓటు: చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నారా?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పు మీద తప్పు చేస్తున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ కేసు విషయంలో చంద్రబాబు చేసిన పది తప్పులు అటూ ఫస్ట్ పోస్టు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. తాజాగా, అటార్నీ జనరల్ గవర్నర్కు చేసిన సూచనల విషయంలోనూ చంద్రబాబు తప్పిదానికి పాల్పడ్డారనే మాట వినిపిస్తోంది.
అటార్నీ జనరల్ను గవర్నర్ సలహా అడిగారని, సెక్షన్ 8 ప్రకారం ఏపీ పోలీసుల జ్యూరిస్డిక్షన్ హైదరాబాద్లో ఉంటుందని అటార్నీ జనరల్ చెప్పారని, పైగా నగరంలో ఏపీ పోలీస్ స్టేషన్లు పెట్టుకోవచ్చని సలహా కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే, అటార్నీ జరనల్ మౌఖికంగా మాత్రమే సలహాలు ఇచ్చారని తెలుస్తోంది. ఆ విషయాన్ని అలా ఉంచితే ఫస్ట్ పోస్టు చంద్రబాబు చేసిన తప్పులను ఈ కింది విధంగా క్రోడీకరించింది.
1. రేవంత్రెడ్డి తెలంగాణ ఎసిబికి చిక్కిన వెంటనే దాన్ని చంద్రబాబును ఇబ్బందిపెట్టేందుకు కేసీఆర్ చేసిన కుట్రగా తెలుగుదేశం పార్టీ అభివర్ణించింది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో రేవంత్ సంభాషణల వీడియో న్యూస్ చానెళ్లలో ప్రసారమైన తర్వాత నాలిక కరుచుకుంది. రేవంత్ రెడ్డి లంచం ఇవ్వజూపారనే వాదనను టిడిపి ఖండించలేకపోయింది.
2. రేవంత్ రెడ్డి వ్యవహారం బట్టబయలు అయిన తర్వాత చంద్రబాబుకు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు మధ్య జరిగిన సంభాషణల ఆడియో లీక్ కావడంతో టిడిపిలో కలకలం బయలుదేరింది. ఇది టిడిపీనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కుదిపేసింది. దాంతో దాన్ని ఉభయ రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు టిడిపి ప్రయత్నించింది.
3. చంద్రబాబు ఆడియో టేపులు బయటపడిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన అంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పొంతన లేకుండా వాదనలు చేశారు. ఆయన మూడు భిన్నమైన వాదనలు వినిపించారు. ఆయన వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఒకటి - ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతు కాదు. రెండోది - వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలను తీసుకుని అతికించారని ఆరోపించారు. మూడోది - తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబు ఫోన్ను ట్యాప్ చేసింది.
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 125 మంది ప్రముఖుల టెలిఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చంద్రబాబు ఆరోపించారు. అదే సమయంలో ఆ టేపులు కట్-కాపీ-పేస్ట్ అని ఆరోపించారు. అదే సమయంలో ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80కిపైగా కేసులు పెట్టించింది. దీంతో ఓటుకు నోటు కేసును దారి మళ్లించడానికి ఎపి ప్రభుత్వం దీన్ని వాడుకుంటోందనే అభిప్రాయం బలంగా ప్రజల్లోకి వెళ్లింది.

5. ఫోన్ ట్యాపింగ్ కేసులను విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఓటుకు నోటు కేసులో పరారీలో ఉన్న నాలుగో నిందితుడు మత్తయ్య జెరూసలెంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేయించడం చంద్రబాబు ప్రభుత్వం చేసిన మరో తప్పిదం. నిందితుడికి ఎపి ప్రభుత్వ పోలీసులు ఆశ్రయం కల్పించారనే వాదనకు బలం చేకూరింది.
6. ఇండియా టుడే టీవీ అసోసియేట్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు ఆ టేపులలో ఉన్న గొంతు తనదో కాదో స్పష్టం చేయకుండా విషయాన్ని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారు. సీఎన్ఎన్-ఐబీఎన్కు చెందిన పల్లవీ ఘోష్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా విషయంపై స్పష్టంగా మాట్లాడలేదు.
7. విభజన చట్టంలోని సెక్షన్ 8ని అమలు చేయాలంటూ టీడీపీ మొదలు పెట్టిన రాద్ధాంతం కూడా ఎదురు తిరిగిందనే చెప్పాలి. రేవంత్రెడ్డి అరెస్టు అయిన తర్వాతే ఈ విషయం గుర్తుకొచ్చిందా? అనే ప్రశ్న ముందుకు వచ్చింది.
8. గవర్నర్పై కొందరు ఏపీ మంత్రులు సహా టిడిపి నేతలతో చంద్రబాబు ఎదురుదాడి చేయించడం తప్పిదమేనని చెప్పాలి. మంత్రులు, టిడిపి నేతలు గవర్నర్పై గంగిరెద్దు వంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు గవర్నర్ వెనక్కి తగ్గేలా చేయడానికి చంద్రబాబు వారి చేత వ్యాఖ్యలు చేయించారని భావన నాటుకుపోయింది. గవర్నర్పై ఎదురు దాడి ప్రతికూల ఫలితం ఇస్తుందని భావించి మంత్రులు వెనక్కి తగ్గేలా చంద్రబాబు చూశారు.
9. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడం వల్ల ఏపీ ప్రభుత్వం నగరంలో తమ సొంత పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుంటుందని, ఆ అధికారం తమకు ఉందని ఎపి మంత్రులు వాదించారు. సెక్షన్ 8ను అమలు చేయాలంటూ ఎపి మంత్రులు, టిడిపి నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాడనికే ఈ పని చేశారనే అభిప్రాయం ఏర్పడింది.
10. వాటన్నింటినీ పక్క న పెడితే ఎపి ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం చంద్రబాబు సంభాషణల ఆడియో టేపు ప్రసారం చేసిన టీ న్యూస్ చానల్కు కేబుల్ టీవీ ప్రసారాల నియంత్రణ చట్టం కింద అర్తరాత్రి నోటీసులు జారీ చేయడం.












Click it and Unblock the Notifications